నాణ్యమైన పంటలకు తోడ్పాటు
అధిక దిగుబడులకు దోహదం
ఎరువుల ఖర్చు తగ్గుదల
అశ్వారావుపేట, జూన్ 12 : వరితోపాటు ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఎక్కువగా యూరియా, ఎన్పీకే (పొటాష్, నత్రజని, భాస్వరం కలిసిన మిశ్రమం) ఎరువులను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల సాగు వ్యయం పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పొలాల్లో సహజంగానే ఈ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి వ్యయం తగ్గుతోంది. నాణ్యమైన దిగుబడులు అధికంగా వస్తాయి. పచ్చిరొట్ట సుమారు 16 రకాల్లో లభిస్తాయి. జనుము, జీనుగు, పిల్లిపెసర, అవిక, అలమంద, మినుము, అబౌల, వెంపల్లి, కానుగ, వేప, జిల్లేడు, కొండ మిరప మొక్కల ఆకులు సహజసిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడతాయి.
పచ్చిరొట్ట విత్తనాల్లో రకాలు
పచ్చిరొట్ట విత్తనాలను చౌడు, వరి పండించే భూముల్లో సాగు చేయవచ్చు. తొలకరి వర్షాలు కురవగానే దుక్కి చేసి పచ్చిరొట్ట విత్తనాలు వేయాలి. వీటిలో ప్రధానంగా జీనుగు, జనుములు, పిల్లిపెసర రకాలుగా అందుబాటులో ఉంటాయి.
జీనుగు : ఈ విత్తనాలను తొలకరి వర్షాలు కురిసిన తర్వాత మొదటి 20 నుంచి 30 కిలోల యూరియాతోపాటు జీనుగు విత్తనాలు వేసుకోవాలి. ఎకరానికి 15 నుంచి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొక్కలు పెరిగి పూత దశకు వచ్చేసరికి 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తున్నది. 40 రోజుల తర్వాత అదే పొలంలో కలియ దున్నుకోవాలి. తర్వాత ఎకరాకు 100 కిలోల సూపర్ పాస్పెట్ వేయాలి. దీంతో మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువు తయారవుతోంది. కుళ్లే సమయంలో నీటితడులు సక్రమంగా ఇవ్వాలి. జీనుగును కలియదున్నిన తర్వాత 10రోజుల వరకు ఇతర పంటలు సాగు చేయకూడదు. ఈ సమయంలో విడుదలయ్యే మిథేన్ వాయువు పంటలకు హాని కలిగిస్తాయి. పొలంలో వేయాల్సిన యూరియా కంటే 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేసినా సరిపోతుంది. వీటిద్వారా 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ ఎరువు లభిస్తాయి.
జనుము : ఎకరానికి 9 నుంచి 14 కేజీల విత్తనాలు అవసరం ఉంటుంది. దీని ద్వారా 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలియదున్నితే 24 కేజీల యూరియా అందుతోంది. ఇందులోనూ 2.3శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం,1.8 శాతం పొటాష్ లభిస్తాయి.
పెసర : పెసర, మినుములతో కూడిన పచ్చిరొట్టతో ఎకరాకు 15 నుంచి 25 కిలోల యూరియా అందుతోంది. వరి సాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడంతో అధిక లాభం ఉంటుంది.
రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు 65 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్తోపాటు ఫోన్నంబర్ అందించి మండల వ్యవసాయ అధికారి వద్ద కూపన్లు తీసుకోవాలి. వీటిని సహకార సంఘాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చి విత్తనాలను తీసుకెళ్లొచ్చు.
ఇవీ ప్రయోజనాలు..
జింకు, మాంగనీసు, ఇనుము వంటి సూక్ష్మరాతువులు పంటలకు లభిస్తాయి.
నీటినిల్వ సామర్థ్యం పెరుగుతోంది.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదపడుతోంది.
తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
భూసారం పెరగడంతో రసాయన ఎరువుల వాడకం 50 శాతం తగ్గిపోతోంది.
సహజ సిద్ధంగా భూసారం పెరిగి నాణ్యమైన అధిక ఉత్పత్తులు సాధించేందుకు దోహదపడుతోంది.
పంటలు రోగాలను తట్టుకుని నిలబడతాయి.
పచ్చిరొట్టతో భూమికి బలం
పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయడం ద్వారా వ్యవసాయ భూమికి బలం చేకూరుతోంది. రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఏటా పచ్చిరొట్ట విత్తనాలను సాగు చేయడంతో భూమి, పంటలకు అవసరమైన నత్రజని, భాస్కరం, పొటాష్ లభిస్తాయి. పచ్చిరొట్ట సాగు చేసుకోవడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయి.
నాగాంజలి, అసిస్టెంట్ ప్రొఫెసర్
(అగ్రానమీ) వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట