ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఈ నెల 16న ఈ రెండు సంస్థల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు మొదలవనున్నాయి. శుక్రవారం వెల్లడైన వివరాల ప్రకారం మూడు రోజులపాటు సాగే ఈ ఇష్యూల్లో దొడ్ల డైరీ.. ప్రమోటర్లు, మదుపర్లకు చెందిన రూ.520 కోట్ల విలువైన ఒక కోటీ 9 లక్షల 85,444 ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెడుతున్నది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ రూ.50 కోట్లదాకా ఉన్నది. ఇక కిమ్స్.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.2,144 కోట్ల విలువైన 2 కోట్ల 35 లక్షల 60,538 ఈక్విటీ షేర్లను విక్రయానికి తెస్తున్నది.
ఫ్రెష్ ఇష్యూ విలువ రూ.200 కోట్ల వరకున్నది. దొడ్ల ఆఫర్ ఫర్ సేల్లో టీపీజీ దొడ్ల డైరీ హోల్డింగ్స్ (92 లక్షలు), దొడ్ల సునీల్రెడ్డి (4,16,604), దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్ (10,41,509), దొడ్ల దీపారెడ్డి (3,27,331) ఈక్విటీ షేర్లున్నాయి. ఐపీవో నిధులను రూ.32.26 కోట్ల బ్యాంక్ రుణాల చెల్లింపునకు, దాదాపు రూ.7.15 కోట్ల మూలధన వ్యయ అవసరాలకూ వినియోగిస్తామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ సునీల్రెడ్డి తెలిపారు. కాగా, కిమ్స్ ఆఫర్ ఫర్ సేల్లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ కేహెచ్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లే ఒక కోటీ 60 లక్షల 3,615 ఉండటం గమనార్హం. ఇక మిగతా షేర్లలో డాక్టర్ భాస్కరరావు బొల్లినేని (3,87,966), రాజ్యశ్రీ బొల్లినేని (7,75,933), బొల్లినేని రమణయ్య మెమోరియల్ దవాఖానలు (3,87,966), ఇతర వాటాదారుల (60,05,058) ఈక్విటీ షేర్లున్నాయి.
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల కోసం 75%, నాన్-ఇనిస్టిట్యూషనల్ బిడ్డర్ల కోసం 15%, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10% షేర్లను కేటాయించారు. సంస్థ, దాని అనుబంధ సంస్థల రుణాలను తీర్చడానికి ఈ ఐపీవో నిధులను కిమ్స్ వాడనున్నది. కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లు ఈ ఇష్యూకు మేనేజర్లుగా ఉన్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఈ షేర్లు నమోదు కానున్నాయి.