న్యూఇయర్ జోష్..

- కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు
- కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న యువత
నెట్వర్క్ : కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే తమ ఇష్టదైవాలను ద ర్శించుకుని కొత్త సంవత్సరంలో తమ కోరికలను నెరవేర్చాలని వేడుకున్నారు. ముంగిళ్లలో మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. ఆత్మీయులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. కేక్లు కట్ చేశారు. గ్రామాల్లో రైతుబంధు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. ఆయా మండలా ల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యువత అర్ధరాత్రి రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వరప్రసాద్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మంగపేట మండలంలోని చర్చిల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కమలాపురం అపోస్తులుల చర్చి లో సీనియర్ పాస్టర్ కిన్నెర ఆదాం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. వేడుకల్లో మాజీ ఎంపీపీ కల్యాణపు ఆగ య్య, పాస్టర్లు విజయరాజు, దేవరాజు, కృపానిధి, శ్రీనివాసపాల్, రాజా ఇమ్మాన్యుయేల్, జానేశ్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం నైన్పాకలో జడ్పీటీసీ గొర్రె సాగర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.