సికింద్రాబాద్, జూన్ 8: కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా నిబంధనలు పాటించాలని కోరారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాస్కులు, మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని పరిరక్షిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నివారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనటువంటి ప్రత్యేక చర్యలతో కరోనా నివారణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జ్వర సర్వే నిర్వహిస్తూ ఏమాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్లు సందేహం కలిగినా రోగులకు ప్రత్యేక మందులతో కూడిన కిట్లను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు వనీత్కుమార్, కిశోర్గౌడ్, సంకు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.