పీర్జాదిగూడ, జూన్ 7: కరోనా నియంత్రణపై పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు మేయర్ జక్క వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కరోనా బాధితుల కోసం ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీన్ని ఇటీవలే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలోనే మొదటగా దాతల సహకారం, మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో పీర్జాదిగూడ నగరపాలక పరిధి మేడిపల్లిలోని పాత పోలీస్స్టేషన్ భవనంలో గతేడాది ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రెండు ఎకరాల సువిశాల స్థలం.. ఆహ్లాదకర వాతావరణంలో కరోనా రోగులకు మానసిక ప్రశాంతతను చేకూర్చేలా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అనునిత్యం ఇద్దరు వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 33 పడకలున్న ఈ కేంద్రంలో కరోనా రోగుల ఆటవిడుపు కోసం వివిధ రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.
ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న బాధితులకు మూడు పూటలా పోషకాహారం అందిస్తున్నారు. ఉదయం లేవగానే యోగ, వ్యాయామం, ప్రాణాయామంతో పాటు పలు ఆసనాలు వేయిస్తున్నారు. అనంతరం వేడినీరు, కాఫీ, టీతో పాటు టిఫిన్ అందిస్తున్నారు. మధ్యాహ్నం పండ్లు, భోజనం పెడుతున్నారు. అంతేకాక కోడిగుడ్లు, మటన్, చికెన్తో ఆహారం.. డిన్నర్లో జొన్నరొట్టెలు ఇస్తున్నారు. పడుకునే ముందు పాలు అందిస్తున్నారు. ఈ ఐసొలేషన్ కేంద్రంలో వసతుల కల్పన కోసం రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు మేయర్ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 213 మంది చేరగా.. చికిత్స పొంది 180 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 33 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారంతో పాటు సరైన వైద్య సేవలు అందిస్తుండటంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఇక్కడే ర్యాపిడ్ టెస్ట్లు చేస్తున్నారు.
కరోనా రహిత కార్పొరేషన్గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించాం. ప్రతిరోజు సెంటర్కు వెళ్లి రోగుల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం. బాధితుల చికిత్స కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయం. – మేయర్ జక్క వెంకట్రెడ్డి