హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయస్థాయిలో మరో అవార్డు సాధించింది. దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్పార్మర్గా ఎంపికైంది. జాతీయస్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక పరిజ్ఞానం మొదలైన విషయాలను సమీక్షించే మిషన్ఎనర్జీ ఫౌండేషన్ (ముంబై) శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినార్లో ఈ అవార్డును ప్రకటించింది. ఈ జాతీయస్థాయి సదస్సులో 525 విద్యుత్సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి 500 మెగావాట్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల థర్మల్ విద్యుత్కేంద్రాల్లో సింగరేణి విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విభాగంలో ఉత్తమప్లాంటుగా ఎంపికైంది. ఈ విభాగంలో 100కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్కేంద్రాలు పోటీపడ్డాయి. అవార్డుకు ఎంపికవడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్, డైరెక్టర్ డీ సత్యనారాయణరావు హర్షం వ్యక్తంచేశారు. 100 శాతం ఫ్లైయాష్ను వినియోగిస్తున్నందుకు కూడా జైపూర్ విద్యుత్కేంద్రం అత్యుత్తమ ప్లాంట్ అవార్డును అందుకున్నది. అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో జాతీయస్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ ర్యాంక్ సాధించింది. 2017-18లో 5వ ర్యాంక్, 2019-20లో 7వ ర్యాంక్, 2018 -19లో 16వ ర్యాంక్, 2016-17లలో 17వ ర్యాంక్ను సాధించింది.