బంజారాహిల్స్, జూన్ 3: జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖాన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన భార్య చావుకు కారణమయ్యారని ఓ వైద్యుడు ఆరోపించాడు. ఆమెకు ఎక్మోపైప్ సరిగా పెట్టలేదని, సిబ్బందికి చెప్పినా వినిపించుకోలేదని మృతురాలి భర్త డాక్టర్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొంపల్లిలో నివాసం ఉంటున్న డాక్టర్ మంచుకొండ భావన (31) రేడియాలజిస్టుగా పనిచేస్తున్నది. కొవిడ్ సోకి కోలుకొన్న భావనకు తిరిగి తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో గత నెల 6న జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతిచెందింది. 26 రోజులుగా తన భార్య అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నదని, బుధవారం ఆమెను చూసేందుకు వెళ్లినపుడు ఆమె వద్ద ఎవరూ లేరని, ఎక్మో పైప్ సరిగా పెట్టలేదని, అక్కడి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని వెల్లడించారు. ఇప్పటికే రూ.56 లక్షలు బిల్లు చెల్లించినా ప్రాణాలు దక్కలేదని వాపోయారు. దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులు, వైద్యశాఖకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకొంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పేర్కొన్నారు.