న్యూఢిల్లీ: దేశంలో అర్హులైనవారందరికీ కోవిడ్ టీకాలను ఈ ఏడాది చివరిలోగా ఇవ్వనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టుతో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. జస్టిస్ చంద్రచూడ్, ఎల్ఎన్ రావు, ఎస్ఆర్ భట్లతో కూడిన ధర్మాసనాకి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరణ ఇచ్చారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, రెడ్డీస్ ల్యాబ్ ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్న టీకాలు దేశంలోని 18 ఏళ్లు దాటినవారందరికీ సరిపోతాయన్నారు. ఫైజర్ లాంటి ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే.. అనుకున్న సమయానికి కన్నా ముందే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తుందని తుషార్ మెహతా తెలిపారు.
వ్యాక్సిన్లు రాష్ట్రాలకు వేరువేరు ధరలకు ఎందుకు అమ్ముతున్నారని జస్టిస్ భట్ ప్రశ్నించారు. అయితే దీంట్లో పోటీ ఏమీ లేదని, ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలు.. ఎక్కువ వాటా పొందుతున్నాయన్న వాదన అవాస్తమని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎందుకు కొన్ని రాష్ట్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు టీకాల కోసం గ్లోబల్ టెండర్లు వేస్తున్నాయని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. కేవలం 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఉచిత వ్యాక్సిన్లు ఎందుకు ఇస్తున్నారు. 18 ప్లస్ వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదని జస్టిస్ చంద్రచూడ్ అడిగారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఎందుకు వ్యాక్సిన్ ధరలను నిర్ణయించారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్లో రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరా.. మరి గ్రామాల్లో ఇది వీలవుతుందా అని ఆయన అడిగారు.
కోవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్లు దొరకడం లేదని, ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని, తనకు వ్యక్తిగతంగా ఎంతో మంది ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు జస్టిస్ భట్ తెలిపారు. 45 ప్లస్ వాళ్లకు వాక్-ఇన్ ఉందా అని జస్టిస్ చంద్రచూడ్ అడగ్గా.. అవునని ఎస్జీ సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ పెడితే, అప్పుడు వేల మంది ఒకేసారి వ్యాక్సినేషన్ సెంటర్కు ఎగబడే ఛాన్సు ఉన్నట్లు తుషార్ తెలిపారు. పని ప్రదేశాల్లోనూ వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ మండిపడ్డారు. వ్యాక్సినేషన్పై పాలసీ డాక్యుమెంట్ కావాలని, కేవలం అఫిడవిట్ కాదు అని, పాలసీ డాక్యుమెంట్ ఇస్తే తాము పరిశీలిస్తామని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.