న్యూఢిల్లీ : దేశంలో ఉధృతి తగ్గుతున్నది. వరుసగా రెండో రోజు రెండు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు వైరస్ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే, మరణాలు మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,73,790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. 45 రోజుల తర్వాత రోజువారీ కేసులు కనిష్ఠ స్థాయికి చేరాయి.
ఈ నెల మొదటల్లో నాలుగు లక్షలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం భారీగా తగ్గాయి. కొత్తగా 2,84,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 3,617 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కు పెరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 2,51,78,011 మంది బాధితులు కోలుకోగా.. మరో 3,22,512 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 22,28,724 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
టీకా డ్రైవ్లో 20,89,02,445 మందికి టీకాలు వేసినట్లు చెప్పింది. మరో వైపు జాతీయ రికవరీ రేటు 90.80శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 9.84శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.36శాతంగా ఉందని, వరుసగా ఐదు రోజూ పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా, మరణాలు రేటు 1.16శాతం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 20,80,048 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 34,11,19,909 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.