కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది పేద ప్రజలు నిరాశ్రయులుగా మారారు. కొందరు పొట్ట నింపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులని గమనించిన సినీ ప్రముఖులు వారిని ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు విరాళాలు అందిస్తుంటే మరి కొందరు నిత్యావసర సరుకులు ఇచ్చి ఆకలి తీరుస్తున్నారు. అయితే సెలబ్రిటీలే కాదు వారి అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆ మధ్య అజిత్ అభిమానులు ఫుడ్ బండ్లను ఏర్పాటు చేసి ఆకలితో ఉన్న వారు వచ్చి ఫుడ్ తీసుకెళ్లండి అన్నారు. ఇక ఇప్పుడు విజయ్ అభిమానులు పుదుకోట్టై ప్రాంతంలో కోతుల కోసం ఓ వాటర్ ట్యాంక్ సహా అరటిపళ్లను ఏర్పాటు చేశారు. పుదుకోట్టై హనుమాన్ టెంపుల్కి సమీపంలో దాదాపు 300 కోతులు ఉన్నాయని, అవి ప్రస్తుతం ఆహారం, నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయని గ్రహించి వీటిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. హీరోలే కాదు అభిమానులలోను మానవత్వం పరిమళించడం గొప్ప విషయం అంటున్నారు.