కొత్తకోట, మే 23: మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో విసుగు చెందిన తల్లి కన్న కొడుకునే కడతేర్చింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. రామకృష్ణాపురానికి చెందిన నాగమ్మ, శాంతన్న దంపతులు. వీరికి ఓ కూతురు, కొడుకు జన్మించారు. ఆ తరువాత భర్త నాగమ్మను వదిలేశాడు. నాగమ్మ కుటుంబ భారాన్ని మోస్తూనే కూతురి వివాహం జరిపించింది. కొడుకు శివ(25) హమాలీ పనులు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా తాగుడుకు బానిసైన శివ తల్లిని వేధిస్తున్నాడు. ఈ నెల 16న తాగిన మైకంలో ఉన్న శివను తల్లి నాగమ్మతోపాటు అమ్మమ్మ బుచ్చమ్మ ఇద్దరు కలిసి తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపారు. ఆ వెంటనే ఇంటి ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టారు. కాగా శివ నాలుగైదు రోజులుగా హమాలి పనులకు రాకపోవడంతో తోటి హమాలీలు ఆదివారం అతని ఇంటికి వెళ్లి తల్లి నాగమ్మను అడిగారు. శివ ఎక్కడికి వెళ్లాడో తెలియదని చెప్పింది. వారికి అనుమానం రావడంతో సర్పంచ్కు సమాచారమిచ్చారు. సర్పంచ్ వెంటనే నాగమ్మను పిలిచి శివ గురించి ఆరా తీయగా తానే చంపి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టినట్టు ఒప్పుకున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.