సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా మొదటి దశ కంటే.. రెండవ దశ చాలా భిన్నంగా ఉంటుంది. కొంత మందిలో అసలు వైరస్ వచ్చిపోయింది కూడా తెలియక పోగా.. మరికొంతమందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకొంత మందిలో లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక రోగికి ఉన్న లక్షణాలు మరో రోగిలో కనిపించడం లేదు. ఒక్కో రోగిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో జ్వరం, ఒంటినొప్పులు వంటివి కనిపిస్తే.. మరికొందరిలో తలనొప్పి, కళ్లు ఎర్రబడడం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి .. ఇలా పలు రకాల లక్షణాలు వేర్వేరు రోగుల్లో కనిపిస్తున్నాయి. అయితే.. లక్షణాలు కనిపించని ఎసింప్టమాటిక్ రోగులతో పాటు స్వల్ప లక్షణాలు కనిపించేవారు సూపర్ స్ప్రెడర్స్గా మారుతున్నారని.. వారివల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. లక్షణాలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి అధికంగా ఉండటమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ తీవ్రత వైరల్లోడ్పై ఆధారపడి ఉంటుందని.. వైరల్ లోడ్ స్వల్పంగా ఉన్నవారిలో లక్షణాలు పెద్దగా కనిపించవని.. వైరల్లోడ్ తక్కువగా ఉన్నవారిలో రిపోర్టు సైతం నెగెటివ్గా చూపించే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. ఆరోగ్యవంతులైన వారిలో వైరల్లోడ్ తక్కువగా ఉండటం వల్ల వారు ఎసింప్టమాటిక్గా లేక స్వల్ప లక్షణాలతో మూడు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వైరల్ లోడ్ అధికంగా ఉన్నవారిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్, గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ అధికంగా ఉంటున్నట్లు కింగ్కోఠి దవాఖాన నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
కరోనా వైరస్ లక్షణాలు మహిళల్లో కంటే పురుషుల్లోనే అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆల్కహాల్, ధూమపానం సేవించడం. వీటి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాంటి వారికి వైరస్ సోకినప్పుడు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఆల్కహాల్, ధూమపానం వంటి వ్యసనాలతో దెబ్బతిన్న ఊపిరితిత్తులు.. వైరస్ ప్రభావంతో మరింత దెబ్బతింటున్నాయి. దీనివల్ల రోగిలో తీవ్రమైన దగ్గు, ఆయసం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగిన వెంటనే లేదా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స తీసుకోవాలి.- డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన