వరంగల్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ సెంట్రల్ జైలు ఉన్న స్థలంలో సకల సౌకర్యాలతో కూడిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. జైలును నగర శివారుకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చుతామని వెల్లడించారు. ఎంజీఎం దవాఖానను మాతా శిశుసంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)గా తీర్చిదిద్దుతామని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు అందుతున్న చికిత్స, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్డౌన్ అమలుపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను వెంటనే పటిష్టపర్చుకోవాలని సీఎం అన్నారు. వరంగల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు తరహాలో ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారక్లలో తిరిగి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. ఏ శిక్ష మీద జైలుకు వచ్చారు? ఏ ఊరు? కుటుంబపరిస్థితి ఏంటి? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో విన్నారు. జైల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. దాదాపు అరగంటపాటు జైలు అధికారులు, ఖైదీలతో ముచ్చటిస్తూ వారి బాగోగులు తెలుసుకొన్నారు. జైలు ఆవరణలో ఉన్న నర్సరీ, వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తుల గురించి తెలుసుకొని అధికారులను, ఖైదీలను ప్రశంసించారు. సత్ప్రవర్తన ఖైదీలు తయారుచేస్తున్న నేత ఉత్పత్తులు, మాస్క్లు, ఫినాయిల్, ఇతర ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి, వారిని అభినందించారు. జైలు సందర్శనలో భాగంగా లోపల ఉన్న కృష్ణ సర్కిల్ 14వ బ్యారక్కు వెళ్లి వెంకన్న, సురేశ్, రాము, మోహన్రెడ్డి, శ్రీనివాస్ అనే ఖైదీలతో ముచ్చటించారు. వారి పేరు, ఊరు పేర్లు అడుగుతూ వారి బాగోగులు తెలుసుకొన్నారు. కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అడిగారు. భోజనం ఎలా ఉంటున్నదని ఓ ఖైదీని అడగ్గా తెలంగాణ వచ్చినంక అన్నం మంచిగుందని బదులిచ్చాడు. జైలు పక్కనే ఉన్న కేఎంసీ, కాళోజీ యూనివర్సీటీ నూతన భవనం నిర్మాణంతో పాటు ఇంకా దాదాపు 20 ఎకరాల స్థలం ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
సాధారణంగా జైళ్లను ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులు, జిల్లా మంత్రులు సందర్శిస్తుంటారు. వరంగల్ జైలు ఏర్పడిన 136 ఏండ్ల చరిత్రలో ఒక సీఎం జైలును సందర్శించడం ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకోవటం అరుదైన విషయమన్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, జైళ్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ఐజీ బచ్చు సైదయ్య, డీఐజీ రాజేశ్, సీపీ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జైలు సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్, డిప్యూటీ సూపరింటెండెంట్ భరత్కుమార్ ఉన్నారు.