న్యూఢిల్లీ, మే 21: మొండి బకాయి (ఎన్పీఏ)ల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు సుప్రీం కోర్టు గొప్ప ఊరటనిచ్చింది. కంపెనీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడంలో భాగంగా వాటికి వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నవారిపై దివాలా చట్టం (ఐబీసీ) కింద బ్యాంకులు చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. బ్యాంకులకు ఇచ్చిన హామీ నుంచి వ్యక్తిగత పూచీకత్తుదారులు తప్పించుకోలేరన్నది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో దాఖలైన 75 పిటీషన్లను కొట్టివేసింది. 2019 నవంబర్ 15న కేంద్రం ఈ నోటిఫికేషన్ను విడుదల చేయగా, దీన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్లు దాఖలయ్యాయి.