భారతదేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనాపై పోరులో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. భారత క్రికెటర్లు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాలని టీమ్ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిర్ణయించారు. తాజాగా శిఖర్ ధావన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను డొనేట్ చేశాడు.
కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారిపై పోరాటంలో సహాయపడటానికి ధావన్ గురుగ్రామ్ పోలీసులకు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశాడు. ధావన్ చేసిన సాయానికి పోలీసులు సోషల్మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.
‘విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చిన్న సేవ చేస్తున్నందుకు కృతజ్ఞుడిని. నా ప్రజలకు, సమాజానికి ఎల్లప్పుడు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను. త్వరలోనే మహమ్మారి నుంచి దేశం బయటపడుతుందని’ ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొవిడ్ సహాయక చర్యల కోసం ధావన్ గతంలోనే రూ.20లక్షలు విరాళంగా ఇచ్చాడు.