నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ తన వాదనలను వినిపించలేకపోయింది. బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్ల ముందు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్ ఆవల ఉండే కోస్తా, రాయలసీమ ప్రాంత అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి వాదనలు వినిపించిందే తప్ప, తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదు. మొత్తం ఆయకట్టు బేసిన్ ఆవలనే గల తెలుగు గంగ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్, బేసిన్లోని కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చే కల్వకుర్తి, నెట్టెంపాడు,ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని పట్టుబట్టలేదని కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నది.
తెలంగాణ అవసరాలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు పెట్టకపోవడం చేత 100 శాతం బేసిన్ లోపల ఉన్న మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగలేదు. కృష్ణా బేసిన్ ఆవల ఉండే కృష్ణా డెల్టా ఆయకట్టు, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు, కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతాలు ముందు నుంచి నీటిని వినియోగిస్తున్నాయన్న సిద్ధాంతం మీద వాటికి రక్షణలు కల్పించుకున్నారు. ఈ కారణంగా బేసిన్లో ఉన్న తెలంగాణ ప్రాంతం నికర జలాల కేటాయింపుల్లో తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని, బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్లలో ఉమ్మడి ప్రభుత్వం 100 శాతం కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల గురించి వాదించకపోవడం వల్ల జరిగిన నష్టం, తదితర అంశాలను ఆ లేఖలో పేర్కొన్నది. కృష్ణా జలాల పునః పంపిణీ కోసం అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం, 1956 సెక్షన్ 3 ప్రకారం ఒక ట్రిబ్యునల్కు నివేదించాలని కోరింది. చట్టం ప్రకారం ఏడాది లోపల కేంద్రం రాష్ట్ర ఫిర్యాదును చర్చల ద్వారా పరిష్కరించాలి, లేదంటే ట్రిబ్యునల్కు నివేదించాలి. కేంద్రం ఈ రెండూ చేయలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ లోపల కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, 2014 సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పదవీకాలాన్ని పొడిగించి కృష్ణా జలాల వివాదాన్ని నివేదించింది.
బచావత్ గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను నాటి ఏపీ ప్రభుత్వం జీవోల ద్వారా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు 299, ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు 512 టీఎంసీలు కేటాయింపులు చేసింది. విభజన తర్వాత కూడా అవే వినియోగాలు కొనసాగాలని నేడు విభజన చట్టం సెక్షన్ 89 కింద బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ వద్ద వాదిస్తున్నది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయమేమంటే.. ఇది రివ్యూ ట్రిబ్యునల్ కాదు. దీనికి నివేదించిన రెండు అంశాలు పరిమితమైన పరిధి కలిగి ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి రెండు ట్రిబ్యునళ్లు కేటాయించిన గంపగుత్త నీటిని ప్రాజెక్టుల వారీగా విభజించడం. రెండోది కృష్ణా నదిలో కొరత ఉన్న సంవత్సరంలో నీటి పంపిణీ ఎట్లా ఉండాలి. ఇంతకు మించి విభజన చట్టం సెక్షన్ 89 కింద బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ చేయలేదు. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్కుమార్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ రెండు రాష్ర్టాల మధ్య కూడా సాధ్యం కానప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం సమసిపోయేదెట్లా?
మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్న జిల్లాలు. ఈ జిల్లాల్లో నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు జూరాల- 17.84, రాజోలిబండ- 15.9, భీమా- 20, నాగార్జునసాగర్ ఎడమకాలువకు- 105, మూసి ప్రాజెక్టు- 9.40 టీఎంసీలు మాత్రమే. మొత్తం 169.14 టీఎంసీలు. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగాలని పోరాడుతున్నది.
నికర జలాలు ఎక్కడ నుంచి వస్తాయి? వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన పరిశోధనల ఫలితంగా తక్కువ పంటకాలం ఉన్న వంగడాలు వచ్చాయి. ఆరుతడి పంటగా కూడా వరిని సాగుచేసే పద్ధతులు అభివృద్ధి చెందాయి. కాబట్టి కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడికాలువ, కేసీ కాలువ రైతులు ఆరుతడి సాగుకు మారాలి. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా ఏటా 100 టీఎంసీలకుపైగా గోదావరి నీటి సరఫరా జరుగుతున్నది. కాబట్టి కృష్ణా డెల్టాకు కేటాయించిన 152 టీఎంసీల నీటిని ఎగువన తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఆంధ్రా అవసరాలకు భంగం వాటిల్లకుండానే తెలంగాణకు మరో 250 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చేయవచ్చు.
పై అంశాలను అనుసరించి తెలంగాణకు న్యాయబద్ధంగా 550 టీఎంసీలు రావాలని తెలంగాణ కోరుతున్నది. అయితే విభజన చట్టం సెక్షన్ 89 కింద పునః పంపిణీకి అవకాశం లేదు కాబట్టే న్యాయం కోసం అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ ఫిర్యాదును ట్రిబ్యునల్కు నివేదించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని రెండవ అపెక్స్ కౌన్సిల్లో పదేపదే ప్రస్తావించడంతో కేంద్ర జల వనరుల మంత్రి ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్నా, కేంద్రం మాట మాత్రం నిలబెట్టుకోలేదు. ఆరు నెలల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. పైగా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధపడుతున్నది.