జెరూసలేం : ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా.. ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు జరుపుతున్నది. ఇరువర్గాల దాడులతో ఇప్పటి వరకు గాజాలో 65 మంది మృతి చెందగా.. ఇజ్రాయెల్లో ఏడుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్పై భారీ బాంబుదాడులు కొనసాగుతున్నాయని, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సీనియర్ సభ్యులతో పాటు గాజా సిటీ కమాండ్ బస్సెం ఇస్సా మృతి చెందాడని హమాస్ ధ్రువీకరించింది. గాజాలో మరణించిన వారిలో 16 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 65 పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 86 మంది పిల్లలు, 39 మంది మహిళలు సహా 365 మంది గాయపడ్డారని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. టెల్ అవీవ్ మెట్రో పాలిటన్ ప్రాంతం, దక్షిణాది నగరాల్లో బుధవారం రాత్రి హమాస్ రాకెట్లతో దాడులకు దిగడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. కనీసం 20 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారు. ఓ రాకెట్ ఇంటి కిటికీలో నుంచి దూసుకువచ్చి బాలుడితో పాటు అతని తల్లిని గాయపరిచింది. తీవ్రంగా గాయపడడంతో బాలుడు మృతి చెందారు. గాజా సరిహద్దులో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు, ఓ భారతీయుడు, మరో ఐడీఎఫ్ సైనికుడు మరణించాడు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఇజ్రయెల్పై 180 ప్రయోగించారని, ఇందులో 40 గాజాలోనే పడిపోయాయని పేర్కొంది. హమాస్ దాడులకు ప్రతిగా ఐడీఎఫ్ గాజా ప్రాంతంలో 500 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది.
హమాస్ సిబ్బంది, ఆయుధాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని బుధవారం రాత్రి వరకు 374 మందిని అరెస్టు చేసినట్లు సైన్యం తెలిపింది. ఈ ఘటనల్ల 36 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం రెండు పశ్చిమ ఆసియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు హమాస్ ఇజ్రాయెల్ వెయ్యికిపైగా రాకెట్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్ సైతం ధీటుగా దాడులకు పాల్పడుతోంది. రాజధాని నగరం జెరూసలేంలోని ఆల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం జరిగిన ఘర్షణ ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.