న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్కి (రెండోదశ కరోనా ఉద్ధృతి) కారణంగా భావిస్తున్న డబుల్ మ్యుటెంట్ వేరియెంట్ (బీ.1.617) టీకాల సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారం లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల సామర్థ్యాన్ని ఈ వేరియెంట్ తగ్గించలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ వైరస్ తీవ్రతను తగ్గించేవేనని భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం ఎవరికైనా కరోనా సోకితే, అలాంటి కేసుల్లో వైరస్ తీవ్రత కొద్ది మోతాదులోనే ఉంటుందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను తట్టుకొని ‘బీ.1.617’ వేరియెంట్ వ్యాప్తి చెందగలదని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో స్వామినాథన్ పైవిధంగా స్పందించారు. దేశంలో సెకండ్వేవ్కు బీ.1.617 వేరియెంట్ కారణమా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కేసుల పెరుగుదలకు ఈ వేరియెంట్ ఒక కారణమని, అయితే సెకండ్వేవ్కు ఇదే కారణమని చెప్పడానికి మరికొంత సమాచారం అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులను ఎత్తివేయడం ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మరోవైపు, బీ.1.617 వేరియెంట్కు చెందిన బీ.1.617.2 సబ్ వేరియెంట్ కూడా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే అవకాశం అతి తక్కువని బ్రిటన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ తెలిపారు.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలపై స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కేసులు, మరణాల్లో వాస్తవ అంకెలను వెల్లడించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. దేశంలో గతేడాది గుర్తించిన ‘బీ.1.617’ వేరియెంట్ను డబ్ల్యూహెచ్వో ‘వేరియెంట్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ (వీవోసీ)’గా పేర్కొన్నదని గుర్తు చేశారు. ఈ రకం వైరస్ సులభంగా వ్యాప్తి చెందగలదన్నారు. మరోవైపు, ‘బీ.1.617’ వేరియెంట్పై అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేసింది. గతవారం రోజుల్లో దేశంలో సగటున 3.90 లక్షల కేసులు నమోదైన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్లు సమతుల్యంగా అందడంలేదని డబ్ల్యూహెచ్వో మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభాలో సగంమంది ధనిక, ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో ఉండగా, కరోనా టీకాల్లో మాత్రం ఆ దేశాల వాటా 83 శాతం ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ ప్రక్రియలో అసమానత్వం పేద దేశాలకు ఇబ్బందిగా మారనున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది.