‘ఎర్ర బంగారం’తో నిండిన కోల్డ్స్టోరేజీలు
కరోనా ప్రభావంతో మూతపడిన ఖమ్మం ఏఎంసీ
శీతల గిడ్డంగులను ఆశ్రయిస్తున్న రైతులు, వ్యాపారులు
మరో వారం రోజుల్లో క్రయవిక్రయాలకు ఛాన్స్
ఖమ్మం వ్యవసాయం, మే 9: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో కోల్డ్ స్టోరేజీలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. నిరుడు ఇదే రోజుల్లో కరోనా లాక్డౌన్ కొనసాగినప్పటికీ మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగాయి. అయితే రైతులు ఆశించిన మేర ధర పలకకపోవడంతో చాలామంది కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయించారు. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు రైతులు ఆశించిన మేర ధర పలికింది. కొంతమేర నిలకడగా కొనసాగింది. రెండో దశ కరోనా ప్రభావం మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులపై చూపింది. పంటను తీసుకొచ్చే రైతులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 16 వరకు మార్కెట్ కమిటీ క్రయవిక్రయాలను నిలిపివేశారు. పొరుగు జిల్లాల రైతులు కూడా నిత్యం ఇదే మార్కెట్పై ఆధారపడుతున్నారు. ఇటీవల క్రయవిక్రయాలు నిలిచే సమయానికి రోజుకు దాదాపు 50 వేల పైబడి బస్తాలను రైతులు మార్కెట్కు తీసుకొచ్చారు. మార్కెట్కు సెలవులు ప్రకటించడం, ఇంట్లో పంటను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో రైతులు శీతల గిడ్డంగులను ఆశ్రయించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోల్డ్ స్టోరేజీలు పూర్తి స్థాయిలో నిండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ సంవత్సరం నూతనంగా రెండు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి రావడంతో 38 లక్షల బస్తాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలిగింది. అయినప్పటికీ మార్కెటింగ్కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయించాల్సి వస్తోంది.
కోల్డ్ స్టోరేజీల వివరాలు..
జిల్లా మార్కెటింగ్శాఖ పరిధిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్తోపాటు మధిర, నేలకొండపల్లి, మద్దులపల్లి, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఐదు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో మాత్రమే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. సత్తుపల్లి, కల్లూరు, ఏన్కూరు మార్కెట్ల పరిధిలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఖమ్మం ఏఎంసీ పరిధిలో 14 కోల్డ్ స్టోరేజీలున్నాయి. 11.13 లక్షల బస్తాల సామర్థ్యం కాగా పూర్తిస్థాయిలో నిండిపోయాయి. మధిర ఏఎంసీ పరిధిలో 12 కోల్డ్ స్టోరేజీలకు గాను 11 లక్షల బస్తాల సామర్థం కాగా.. 9.61 లక్షల బస్తాలు, నేలకొండపల్లి ఏఎంసీ పరిధిలో 2 కోల్డ్స్టోరేజీల్లో కలిపి 2.20 లక్షల బస్తాలకు గాను ప్రస్తుతం 30 వేల బస్తాలు స్టోర్ చేసేందుకు అవకాశం ఉంది. వైరా మార్కెట్ పరిధిలో 6 కోల్డ్ స్టోరేజీలకు గాను 7 లక్షల బస్తాల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం అక్కడ 30 వేల బస్తాలు నిల్వ చేసే అవకాశం ఉంది. మద్దులపల్లి మార్కెట్ పరిధిలో 6 స్టోరేజీలకు గాను 7 లక్షల బస్తాల నిల్వ సామర్థం ఉంది. ప్రస్తుతం అవి ఫుల్ అయ్యాయి. మొత్తంగా ఐదు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 40 కోల్డ్స్టొరేజీలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 38 లక్షల బస్తాలు. శుక్రవారం నాటికి జిల్లా మార్కెటింగ్శాఖ అధికారుల నివేదిక ప్రకారం రైతులు, వ్యాపారులు కలిపి దాదాపుగా 36 లక్షల బస్తాలకుపైగా నిల్వ చేశారు. కేవలం 2 లక్షల బస్తాలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి సామర్థ్యం నిండే అవకాశం ఉంది.
వారం రోజుల్లో క్రయవిక్రయాలకు ఛాన్స్
మరో వారం రోజుల్లో తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలను ప్రారంభించేందకు పాలకవర్గ బాధ్యులు, అధికారులు యోచిస్తున్నారు. ఈ నెల 16 వరకు క్రయవిక్రయాలకు సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ.. 17 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిత్రం కొవిడ్ బారిన పడిన సిబ్బంది, కార్మికులు, వ్యాపారులు ఈలోగా కోలుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పంటను కోల్డ్ స్టోరేజీల్లోనిల్వ చేయడం వల్ల రైతులు కూడా తక్కువగానే వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు, అధికారులు అంచనా వేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో పంటను నిల్వ చేసుకున్న రైతులు కేవలం ఒక్క బస్తాను మాత్రమే యార్డుకు తీసుకొచ్చి శాంపిల్ చూపించి పంటను విక్రయించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.