‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
పినపాక, మే 9 : శోభాయమానం అనే పదానికి నిలువుటద్దంలా నిలిచింది ఆ గ్రామం. అటు పల్లె ప్రకృతి వనం, ఇటు రహదారుల వెంట పచ్చదనంతో శోభిల్లుతోంది ఆ గ్రామం. అదే గ్రామమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మల్లారం. పచ్చందాలు పంచుతూ ఆ గ్రామాన్ని సంపూర్ణంగా మార్చిన కార్యక్రమం పల్లె ప్రగతి. పల్లె వికాసం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆ కార్యక్రమం గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చిందంటే అతిశయోక్తి కానేకాదు.
గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ప్రకృతివనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, మొక్కల పెంపకం, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణాలతో గ్రామాలు అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులతో పచ్చదనంతో విరాజిల్లుతుంది పినపాక మండలంలోని మల్లారం పంచాయతీ.
ఈ పంచాయతీ పరిధిలో మల్లారం, గొట్టెల్ల, రాజుపేట గ్రామాలున్నాయి. జనాభా 1200. పల్లెప్రగతిలో భాగంగా ఆ మూడు గ్రామాల్లో నిర్మించిన ప్రకృతి వనాల్లో ఏడు వేల పూల, పండ్ల మొక్కలు నాటారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో 1400 మొక్కలు నాటారు. వీటితోపాటు డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు చేపట్టారు. డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయి. ఈ పంచాయతీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.1.97 లక్షలను గ్రామ పంచాయతీ అకౌంట్లో జమచేస్తోంది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రోడ్ల ఆక్రమణలు, పాత ఇళ్లు, బావుల తొలగింపు వంటి పనులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఎవెన్యూ ప్లాంటేషన్కు పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే వీధుల్లో చెత్త సేకరణతో పారిశుధ్య పనులు మెరుగుపడ్డాయి.
ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామస్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు మల్లారం, గొట్టెల్ల, రాజుపేట గ్రామాల్లో ఒక్కోటి చొప్పున పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. ఈ వనాల్లో పండ్లు, పూల మొక్కలతోపాటూ ఔషధ మొక్కలను కూడా నాటి పెంచుతున్నారు. గ్రామస్తులు సేద తీరేందుకు ప్రకృతి వనంలో బెంచీలను ఏర్పాటుచేశారు. వాకింగ్ చేసేందుకు ట్రాక్లను కూడా ఏర్పాటుచేశారు. సర్వాంగ సుందరంగా ఏర్పాటుచేసిన ఈ ప్రకృతి వనాలు ప్రజలకు ఎంతగానో ఆహ్లాదాన్నిస్తున్నాయి.
వైకుంఠధామం పనుల్లో జాగు..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మల్లారంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు మాత్రం నత్త నడకన కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామానికి కొంతదూరంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
గ్రామస్తుల సహకారంతో పంచాయతీ అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. పంచాయతీలో జరిగే ప్రతి అభివృద్ధి పని గురించీ ముందస్తుగా గ్రామస్తులతో చర్చిస్తున్నాం. తరువాతే ప్రారంభిస్తున్నాం. పంచాయతీలో నాటిన ప్రతి మొక్కనూ బతికించడానికి నూరు శాతం కృషిచేస్తున్నాం. అందరి సహకారంతోనే పంచాయతీని పరిశుభ్రంగా మార్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం మరువలేనిది. -కొమరం రాధాబాయి, సర్పంచ్, మల్లారం