అన్నివర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయం
వైరా ఎమ్మెల్యే రాములునాయక్
ఏన్కూరులో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఖమ్మం సిటీ, మే 9: ‘కొవిడ్’.. ఈ పదం వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. కండలు తిరిగిన యోధులు సైతం గజగజ వణుకుతున్నారు. గుండె ధైర్యం, మనో నిబ్బరంతో ఉంటే మహమ్మారి దరిచేరదని వైద్య నిఫుణులు పదేపదే చెబుతున్నా ‘పాజిటివ్’ అనగానే నీరసించిపోతున్నారు. ఏదో జరిగిందనే భయ పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. అవసరం లేకపోయినా ఆసుపత్రుల దిశగా పరుగులు పెడుతున్నారు. ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ సర్కారు.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించడంతోపాటు కొవిడ్ బాధితులకు లక్షణాల ఆధారంగా ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ముందస్తు వ్యూహం ‘జ్వరం సర్వే’ ఖమ్మం జిల్లాలో సూపర్ సక్సెస్గా కొనసాగుతోంది. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్వీయ పర్యవేక్షణలో, జిల్లా వైద్యారోగ్యశాఖ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బ్భంది కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు.
ఆదివారం రోజూ విధుల్లోనే..
ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలతోపాటు వారాంతపు సెలవులు కచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన తరుణంలో సీఎం కేసీఆర్ సర్కార్ ఆదేశాల మేరకు జ్వరం సర్వే బృందాలు ఆదివారం సైతం విధుల్లో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల మేరకు 419 బృందాలు జిల్లాలోని వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగారు. గ్రామ పంచాయతీలు సమకూర్చిన ఆక్సీమీటర్ల సాయంతో 14,810 కుటుంబాలను సందర్శించి 329 మంది కొవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించారు. వారిలో లక్షణాల తీవ్రత ఆధారంగా 239 మందికి అక్కడికక్కడే మందుల కిట్లు అందించారు. ఈ క్రమంలో ప్రభుత్వ సిబ్బంది ప్రజలతో మమేకం అవుతూ జ్వర పీడితుల్లో మనోధైర్యం నింపుతున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కరోనా అనగానే కడుపున పుట్టిన వారే కాదు.. అత్యంత దగ్గర బంధువులు సైతం కనీసం పలుకరించకుండా మొఖం చాటేస్తున్న రోజులివి. కానీ ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ దీపికలు, సర్పంచ్లు, స్వచ్ఛంద సేవకులు వచ్చి ఆప్యాయంగా మందలిస్తున్నారు. జ్వరం అని తెలియగానే అక్కడే మందులు అందించి ఆదరిస్తున్న తీరు తెలంగాణ ప్రభుత్వ ఆశయానికి అద్దం పడుతోంది.
మూడు రోజుల్లో 54 వేల ఇళ్లకు..
కరోనా మహమ్మారి విస్తరణకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ సర్కారు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఖమ్మం జిలాలోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, 26 ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు ముమ్మరంగా పర్యటిస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్, మరోవైపు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ గడపగడపకూ వెళుతున్న సిబ్భంది వైరస్ వ్యాప్తి నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్నారు. జిల్లాలో ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులే అయినప్పటికీ మొత్తం 54,453 కుటుంబాలను సందర్శించి వివరాలు నమోదు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 1,118 మంది జ్వర పీడితులను గుర్తించారు. వారిలో స్వల్ప కొవిడ్ లక్షణాలు కలిగిన 981 మందికి అక్కడికక్కడే మందుల కిట్లు అందించి హోం ఐసోలేషన్ పద్ధతిలో వైద్యసేవలు అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వారిని మండల వైద్యాధికారులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొవిడ్ బాధితులకు ఎంతగానో ఉపకరిస్తోంది. పాజిటివ్గా నిర్ధారణ అయిన పేషెంట్లు వైద్యం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతున్న తరుణంలో సర్కారు సిబ్భందే ఇంటి వద్దకు వచ్చి మందులతోపాటు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
ఫలించిన సర్కారు వూహ్యం..
కరోనా సెకెండ్ వేవ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిఒక్కరూ ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో సకల జనుల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సరికొత్త కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. కొవిడ్ బాధితులకు నిరంతరం వైద్యసేవలు అందిస్తూనే వైరస్ వ్యాప్తికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం ఉన్నవారిని గుర్తించడం, ఇంటి దగ్గరే మందులు అందిస్తుండడంతో జిల్లాలో రోజుకు వందలాది మంది సామాన్యులకు లబ్ధి చేకూరుతోంది. అదేక్రమంలో ఆక్సీజన్ కొరత, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల పేరుతో ప్రైవేట్ వైద్యులు, యాజమాన్యాలు చేస్తున్న అనాగరిక చర్యలకు సైతం అడ్డుకట్ట పడుతోంది. కొవిడ్ అధిక లక్షణాలున్న ప్రజలను ప్రభుత్వ సిబ్బందే స్వయంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్సు చేస్తున్నందున తక్షణమే మెరుగైన సేవలు లభిస్తున్నాయి. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో నయాపైసా ఖర్చు లేకుండా సకాలంలో ఆక్సీజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందించి ప్రాణాలు నిలబెడుతున్నారు. దీంతో తెలంగాణ సర్కారు ముందస్తు వ్యూహానికి సబ్బండ వర్ణాలు నీరాజనం పలుకుతున్నాయి.