హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అదేవిధంగా ప్రైవేటు టీచర్లకు అందించే సాయాన్ని మరో 80 వేల మందికి విస్తరించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కూడా అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.