హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న రాత్రికర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారంపాటు పొడిగించింది. ఈనెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో తొలుత ఏప్రిల్ 20వ తేదీన 10 రోజులపాటు రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని మే 8 వరకు పొడిగించారు. ఈ గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో దీనిని మరో వారం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. పెండ్లి, ఇతర శుభకార్యాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వంద మందికి మించకుండా నిర్వహించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇచ్చారు. వివిధ రాజకీయ, సాంస్కృతిక, క్రీడలు, ఇతర వర్గాల సామూహిక సమావేశాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఎవ్వరూ సమూహంగా గుమిగూడి సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొం ది. కేంద్రహోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.