ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఎప్పుడూ ఎడమొగం పెడమొగంగానే ఉంటాయి. దక్షిణకొరియా తరచుగా ఉత్తరకొరియా ప్రజలను కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉంటుంది. అందుకు రేడియో ప్రచారాలు మొదలుకుని కరపత్రాల దాకా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటుంది. తాజాగా దక్షిణం నుంచి బెలూన్ ద్వారా పంపిన కరపత్రాల గురించి ఉత్తరకొరియా ప్రభుత్వ పత్రిక రొడాంగ్ సిన్మున్ ప్రజలను హెచ్చరించింది. ఆ కరపత్రాలకు కరోనా వైరస్ అంటించి ఉంటారని పేర్కొన్నది. గాలిలో ఎగిరొచ్చే వస్తువైనా సరే అందులో దుర్మార్గమైన వైరస్ ఉండొచ్చని తెలిపింది. కోవిడ్-19 జాగ్రత్తల ప్రకారం ఆలోచించి మసలుకోవాలని తెలిపింది. అయితే ఈసారి కరపత్రాలు దక్షిణ కొరియా ప్రభుత్వం పంపినవి కావట. ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వచ్చి దక్షిణ కొరియాలో స్థిరపడ్డ ఓ అసమ్మతివాది వాటిని పంపాడట. పార్క్ సంగ్-హాక్ అనే ఆ అసమ్మతివాది ఓ బెలూన్ సాయంతో 5 లక్షల కరపత్రాలు, 5 వేల డాలరు కరెన్సీ నోట్లు, 500 చిన్న పుస్తకాలు ఉత్తర కొరియాలోకి పంపాడు. ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా సీరియస్ అయ్యేసరికి దక్షిణ కొరియా వెంటనే స్పందించింది. అధికారులు అసమ్మతివాది ఆఫీసుపై దాడిచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దాడికి సంబంధించిన వివరాలేవీ దక్షిణకొరియా అధికారులు వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో దక్షిణకొరియా ఇలాంటి కార్యకలాపాలను అనుమతించడం లేదు. ఉత్తరకొరియాలోకి కరపత్రాలు, పెన్డ్రైవ్ల వంటివి పంపేవారికి మూడేళ్ల జైలుశిక్ష విధించాలని కొత్తచట్టం తెచ్చింది. మూడేళ్లు లేదా 30 ఏళ్లు జైలులో పెట్టినా ఉత్తర కొరియా ప్రజలను కమ్యూనిజం నుంచి విముక్తి చేసే కార్యకలాపాలు వదిలిపెట్టబోనని అసమ్మతివాది పార్క్ సంగ్-హాక్ మీడియాకు తెలిపారు.