లక్నో: దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఐటీబీపీ రెఫరల్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను భారత్లోని ఇటలీ రాయబారి విన్సెంజో డి లూకా గురువారం ప్రారంభించారు. ఐటీబీపీ, ఇటలీ బృందం కలిసి 48 గంటలపాటు శ్రమించడంతో ఈ ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రం వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఒకేసారి వంద పడకలకు ఆక్సిజన్ను సరఫరా చేయవచ్చని చెప్పారు. ఇటలీ, భారత్ స్నేహం, సంఘీభావంతో కలిసి పని చేస్తాయనడానికి ఇది సంకేతమని కొనియాడారు.
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు, మరణాలు నాలుగు వేలు దాటాయి. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ఆక్సిజన్, అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. వీటి కొరతతో కరోనా రోగులు మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి. ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు, ఔషధాలను అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటలీ సమకూర్చిన మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ను నోయిడాలోని ఐటీబీపీ రెఫరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.