ఇప్పటివరకు మనుషులపై క్రూరంగా దాడిచేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు జంతువులపైనా ఫోకస్ చేసింది. ఏకంగా 8 సింహాలపై పంజా విసిరింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆసియాటిక్ సింహాలకు వైరస్ సోకింది. ఇది దేశంలోనే తొలిసారి కావటం గమనార్హం. కరోనా సోకిన సింహాలను ఐసొలేషన్లో ఉంచి, ప్రత్యేక చికిత్స, ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మే 4, చార్మినార్: హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఎనిమిది సింహాలకు కరోనా సోకింది. దేశంలోనే ఇటువంటి ఘటన మొట్టమొదటిసారిగా ఇక్కడే వెలుగుచూసింది. ఈ విషయాన్ని జూపార్క్ క్యురేటర్ సుభద్రాదేవి ధ్రువీకరించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడి సింహాలు శ్వాస సంబంధిత వ్యాధులకు గురయ్యాయి. ముక్కు కారటం వంటి కరోనా లక్షణాలు కన్పించటంతో అప్రమత్తమైన అధికారులు సింహాల లాలాజలాన్ని సేకరించి అత్తాపూర్లోని ల్యాబరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్డేంజర్డ్ స్పీసీస్-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (ల్యాకోన్స్-సీసీఎంబీ)కు పంపి టెస్టు చేయగా, కొవిడ్ నిర్ధారణ అయ్యింది. సోకిన వైరస్ కొత్త రకం కాదని, సార్స్ కోవ్-2 రకానికి చెందినదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా తెలిపారు. జూపార్క్లో పనిచేసే కీపింగ్ స్టాఫ్ నుంచే సింహాలకు వైరస్ సోకిందని వెల్లడించారు. ఒక సింహం మరో సింహంతో దగ్గరగా ఉండటం వల్లే వాటికి కరోనా సోకిందని తెలిపారు. అయితే జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్న దానిపై వాస్తవిక ఆధారాలేవీ లేవని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఆరోగ్యంగానే..
వైరస్ సోకిన సింహాలను ఐసొలేషన్కు తరలించి వెటర్నరీ వైద్యుల బృందంతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వాటికోసం ప్రత్యేక ఆహార మెనూ రూపొందించి సమయానుసారం అందిస్తున్నామని, అవి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ వెటర్నరీ వైద్యుడు హకీం తెలిపారు. ఎప్పటికప్పుడు సింహాల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. కాగా, జూలోని ఇతర జంతువులకు కరోనా సోకకుండా ఎన్క్లోజర్ల వద్ద శానిటేషన్ చేసి, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా, సింహాల్లో కరోనాను గుర్తించాక వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ నెల 2 నుంచే సందర్శకులకు అనుమతిని నిలిపివేశారు. జూలోని లయన్ సఫారీ పార్క్లో 11 ఆసియాటిక్ సింహాలున్నాయి. ఇందులో 5 ఆడ, 3 మగవి ఉండగా మిగతావి కూనలు.
పెంపుడు జంతువులకు దూరం
ప్రస్తుతం పెంపుడు జంతువులకు, జూలో జంతువులకు కరోనా లక్షణాలున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులు తమ నుంచి జంతువులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పెంపుడు జంతువులైనా సరే దూరంగా ఉంటే మేలు.
దేశంలోనే తొలిసారి
కరోనా మొదటి దశలో అమెరికాలోని న్యూయార్క్ బ్రాంజ్ జూలో పెద్దపులికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. కానీ, మనదేశంలో ఇదే తొలిసారి. సింహాలకు వైరస్ సోకటంతో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే జూపార్కులు, ఎకో టూరిజం సెంటర్లు, ఎకో పార్కులను మూసేసిన క్రమంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. మరోవైపు గుజరాత్ గిర్ ఫారెస్ట్లోని సింహాల్లో కొన్నింటికి, రాజస్థాన్ జైపూర్ జూ, ఢిల్లీ జూలలోని కొన్ని జంతువులకు, సింహాలకు కరోనా లక్షణాలున్నట్టు సమాచారం ఉన్నా, నిర్ధారణకాలేదు.