దేశంలో సామూహిక టీకా కార్యక్రమం
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకొలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ (సీడ్స్) స్వచ్ఛంద సంస్థతో పెప్సికో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొన్నది. సీడ్స్ సంస్థ దేశవ్యాప్తంగా సామూహిక టీకా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, వైద్య సదుపాయాలతో కూడిన కొవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నది. తొలిదశలో స్థానిక ఆరోగ్య వ్యవస్థతో కలిసి లక్ష టీకా డోసులను అందజేస్తారు. అనంతరం మూడునెలల్లో ఐదు రాష్ర్టాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేస్తారు. రెండోదశలో పెప్సికో పౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు, పల్స్ ఆక్సిమీటర్లు, శానిటైజర్లు అందిస్తారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో పరిమితంగా ఉన్న వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం కృషిచేస్తామని సీడ్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ మను గుప్తా తెలిపారు.