హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఫలితం వెలువడింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందాడు. బీజేపీ అభ్యర్థి మందుగుల అఖిల్ గౌడ్ గెలుస్తాడని భావించినప్పటికీ, ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు.
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో మొత్తం 13,629 ఓట్లు పోలవ్వగా, 13,340 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 7,240 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 5,968 ఓట్లు రాగా, నోటాకు 101 ఓట్లు వచ్చాయి. 188 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
లింగోజిగూడ డివిజన్కు ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్కు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.