న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పేస్ బౌలర్, ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్కు ఆడుతున్న ప్యాట్ కమిన్స్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇండియాలో కరోనా దుస్థితిని గమనించిన అతడు.. హాస్పిటల్స్లో ఆక్సిజన్ సరఫరా కోసం 50 వేల డాలర్లు (సుమారు రూ.37 లక్షలు) పీఎం కేర్స్కు విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు ఐపీఎల్లో తన సహచర ఆటగాళ్లను కూడా విరాళం ఇవ్వాల్సిందిగా అతడు కోరాడు.
ఇండియాకు రావడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. ఇక్కడి వాళ్లు చాలా మంచి వాళ్లు. కానీ ఈసారి పరిస్థితులు ఇంత దారుణంగా ఉండటం నన్ను ఎంతగానో బాధపెడుతోంది అని కమిన్స్ ఒక ప్రకటనలో చెప్పాడు. కరోనా ఈ స్థాయిలో పెరిగిపోతున్న సమయంలో ఐపీఎల్ అవసరమా అని కొందరు చేస్తున్న విమర్శలపైనా కమిన్స్ స్పందించాడు.
చాలా మంది ఐపీఎల్ జరగడంపై విమర్శలు చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఆలోచన మరోలా ఉంది. లాక్డౌన్లో ఉన్న ప్రజలు కొన్ని గంటల పాటైనా ఎంజాయ్ చేయడానికి ఐపీఎల్ పనికొస్తుంది అన్నది వాళ్లు ఆలోచన. మా వల్ల కోట్ల మందికి మేలు జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఆ ఉద్దేశంతోనే ఆక్సిజన్ కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్కు విరాళమిచ్చాను అని కమిన్స్ చెప్పాడు.
నా సహచర ఆటగాళ్లే కాదు, ప్రపంచంలో ఉన్న అందరిని ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను 50 వేల డాలర్లతో ఈ పని ప్రారంభిస్తున్నాను అని కమిన్స్ అన్నాడు. ఇప్పటికే ఓవైపు ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళనతో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంటిదారి పట్టిన సమయంలో కమిన్స్ ఈ విరాళం ఇవ్వడం విశేషం.