హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యోన్ముఖులు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం వరంగల్రూరల్ కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని సర్పంచ్లు, అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, గ్రామ కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తీవ్రత తక్కువ ఉన్నదని చెప్పారు.
కరోనా మొదటివేవ్లోలాగా రెండోవేవ్లోనూ ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు. అంద రూ మాస్క్ పెట్టుకునేలా ప్రజల్లో అవగాహన, చైతన్యం తేవాలని చెప్పారు. మాస్కు పెట్టుకోనివారికి రూ.1000 జరిమానా విధించాలని ఆదేశించారు. 45 ఏండ్లు నిండినవారంతా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సోడియం హైపోక్లోరైట్తో శానిటేషన్ చేయించాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు పాల్గొన్నారు.