న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరుపగా అతడి అనుచరుల్లో ఒకరు మరణించగా మరొకరు గాయపడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఈ ఘటన జరిగింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు కుల్దీప్ మాన్ అలియాస్ ఫజ్జాపై రూ.2 లక్షల పోలీస్ రివార్డ్ ఉన్నది. అరెస్టైన అతడ్ని గురువారం చికిత్స కోసం గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు.
అయితే అక్కడ మాటు వేసిన కుల్దీప్ అనుచరులు ఒక్కసారిగా పోలీసుల కండ్లలో కారం చల్లారు. అనంతరం స్కార్పియో కారు, ఒక బైక్పై వారు పారిపోతుండగా పోలీసులు కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక అనుచరుడు చనిపోగా మరొకడు గాయపడినట్లు పోలీస్ అధికారి అలోక్ కుమార్ తెలిపారు. మిగతా అనుచరులతో కలిసి కుల్దీప్ మాన్ తప్పించుకుని పారిపోయినట్లు చెప్పారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులను అలెర్ట్ చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.