మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
12 మంది అంగన్వాడీ వంట మహిళలు మృతి
గ్వాలియర్: వాళ్లంతా అంగన్వాడీ కేంద్రంలో వంట చేసి జీవనం గడిపే సామాన్య మహిళలు. బస్సు రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా ఓల్డ్ చవానీలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్తోపాటు, అందులో ప్రయాణిస్తున్న 12 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అంగన్వాడీ కేంద్రంలో వంట పనులు చేసేవాళ్లు. ఓల్డ్ చవానీలో వంటపనులు ముగించుకొని రెండు ఆటోల్లో మహిళలు సొంతూళ్లకు ప్రయాణమయ్యేవారని, అయితే మంగళవారం ఉదయం ఒక ఆటోలో సమస్య తలెత్తటంతో మిగిలిన ఒక్క ఆటోలోనే అందరూ ప్రయాణించారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరగ్గానే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడన్నారు.