ఆదిలాబాద్ రూరల్ : “ప్రభుం ప్రాణనాధం.. విభుం విశ్వనాధం.. బ్రహ్మమురారి సురార్ఛిత లింగం.. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమః శివాయ..” అనే పాటలు, శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. గురువారం వేకువజామునే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయాల్లో దేవదేవుడి దర్శనం కోసం బారులుదీరారు.. భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, మహాయాగం నిర్వహించి.. మొక్కులు చెల్లించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. రాత్రంతా భజనలు చేశారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పూజల్లో పాల్గొనగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి. ఆయా చోట్ల ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో నదీజలాల్లో పుణ్యస్నానాలాచరించారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ పట్టణ కేంద్రాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బేల మండలంలోని బాదీ గ్రామంలో నందీశ్వరాలయంలో జిల్లా జూనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి కుటుంబ సభ్యులతో కలిసి, తలమడుగు మండలం ఝురి గ్రామంలో పురాతన శివాలయంలో టీఎస్ డీడీసీ చైర్మన్ లోకా భూమారెడ్డి పూజలు చేశారు.
ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జునాలయంలో, నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద సోమేశ్వరుడికి భక్తులు తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండలంలోని కదిలి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భైంసా మెజిస్ట్రేట్ దంపతులు పూజలు చేశారు, మామడ మండలంలోని బూరుగుపల్లి, లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్, దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం తరలివచ్చింది. గొడిసెర్యాలలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్లోని పశుపతినాథ్ ఆలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి పూజలు చేశారు.