కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం మమతా బెనర్జీ నామినేషన్ వేసిన తర్వాత తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తనను నలుగురు, ఐదుగురు కలిసి తోసేశారని ఆమె ఆరోపిస్తుండగా.. ఎన్నికల ముందు డ్రామా అని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడీ ఇద్దరూ ఎన్నికల సంఘానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ లేఖలు పంపించారు. తమ పార్టీ చీఫ్ను హత్య చేయడానికి జరిగిన కుట్ర ఇది అని తృణమూల్ ఆరోపించగా.. అవన్నీ అబద్ధాలని, ఆ ఫుటేజీ చూపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
డీజీపీని తొలగించిన 24 గంటల్లోనే..
పశ్చిమ బెంగాల్ డీజీపీని తొలగించిన 24 గంటల్లోపే మమతా బెనర్జీపై హత్యాయత్నం చేశారని తృణమూల్ తన లేఖలో ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల సంఘం డీజీపీని తొలగించిందని టీఎంసీ చెబుతోంది. డీజీపీని తొలగించడం, ఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులు లేకపోవడంపై తృణమూల్ ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొందరు సంఘ విద్రోహ శక్తులను నందిగ్రామ్కు తరలించినట్లు తమకు సమాచారం ఉందని ఆ పార్టీ చెబుతోంది.
ఇవి తీవ్ర ఆరోపణలు
అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను చాలా సీరియస్గా తీసుకుంది. ఓ ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన విషయంలో ఈ ఆరోపణలు ఏంటని ప్రశ్నిస్తోంది. సీఎం పర్యటనలో భద్రతా సిబ్బంది, వేలాది మంది పోలీసులు ఉన్నా ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఆ సమయంలోని వీడియో ఫుటేజీని బయటపెడితే అసలు సంగతేంటో తెలుస్తుందని బీజేపీ స్పష్టం చేసింది.