కోల్కతా : నిన్న ప్రకటించిన జాబితాలో సొనాలీ గుహా పేరు లేకపోవడంతో గుహా అనుచరులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల్లో మంచి సంబంధలు కలిగివున్న సొనాలీని మమతా బెనర్జీ దూరం పెట్టడంతో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధపడేదేం లేదు.. బీజేపీలో చేరి గౌరవప్రదమైన పదవిని సంపాదిస్తాను.. అంటూ అభయమిచ్చారు సొనాలీ గుహా. ఈ మేరకు ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్తో ఫోన్లో మాట్లాడి తన నిర్ణయాన్నిచెప్పినట్లుగా సమాచారం.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీ తరఫున బరిలో నిలిచే 291 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈసారి చాలా మంది సిట్టింగులు, సీనియర్లను కాదని కొత్తవారికి మమతా అవకాశం కల్పించారు. దాంతో టిక్కెట్లు దక్కని వారంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సత్గాచియా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మమతా బెనర్జీకి అనుచరురాలిగా పేరుగాంచిన సొనాలీ గుహాకు టిక్కెట్ దక్కకపోవడంపై సత్గాచియాలోని టీఎంసీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సార్లు ఇదే స్థానం నుంచి గెలుపొంది మచ్చలేని నేతగా ఉన్న సొనాలీని కాదని మరొకరికి ఎలా టిక్కెట్ ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సొనాలీ గుహా తొలుత మాట్లాడేందుకు నిరాకరించారు. మీడియాను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తనకు టిక్కెట్ దక్కలేదని రుజువు చేసుకున్న తర్వాత.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్తో ఫోన్లో సంభాషించి బీజేపీలో చేరేందుకు తన ఆసక్తిని చూపారు. ‘పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నాను. పార్టీ కోసం తన కుటుంబాన్ని ధారబోశాను. ఒక రాజకీయవేత్తగా ఒంటరిగా, సోమరిగా ఉండలేను. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. దేవుడు మమతకు సద్బుద్ధిని ఇవ్వాలి. త్వరలో బీజేపీలో చేరతాను. గౌరవప్రదమైన పదవికి పొందుతాను’ అని చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన సొనాలీ గుహా.. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు మమతకు వెన్నంటిగా నిలిచారు. కాగా, టీఎంసీ జాబితా వెల్లడైన అనంతరం చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ చెప్పారు.