ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ స్టార్. చాలా అరుదుగా హీరోలు సాధించే ఇమేజ్ ఇది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో ప్రభాస్, యశ్ మాత్రమే పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇంకా పర్ఫెక్టుగా చెప్పాలంటే కేవలం ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియన్ స్టార్ అని నిరూపించుకున్నాడు. బాహుబలితో వచ్చిన మార్కెట్ గాలివాటం కాదని సాహో సినిమాతో హిందీలో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి నిరూపించాడు. ఈ సినిమాతో అక్కడ ప్రభాస్ రేంజ్ ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. తెలుగులో ఫ్లాప్ అయిన సాహో హిందీలో హిట్ అయింది. సాహో తర్వాత వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ లాంటి రొమాంటిక్ సినిమాను కూడా పాన్ ఇండియాలో విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈయన ఇకపై కేరాఫ్ ముంబై అవ్వాలనుకుంటున్నాడు. తన మకాం పూర్తిగా ముంబైలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే అక్కడ భారీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడు. ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రభాస్. పైగా ఈయన చేసే సినిమాలన్నీ ముంబై నేపథ్యంలోనే సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్తో సలార్ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సాగనుంది. కేజీయఫ్ లాంటి సినిమా తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఇది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ కూడా పూర్తిగా ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ జరగనుంది. దీనికోసం రూ.300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ సినిమా కూడా పాన్ ఇండియన్ సబ్జెక్టే.
ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్. ఇండియాలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో కూడా ఈయనే. ఈ సినిమాల కోసం కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండబోతున్నాడు ప్రభాస్. గతంలో మాదిరి హైదరాబాద్లో ఉండటం సాధ్యం కాదు. అందుకే అక్కడ భారీగా ఖర్చు చేసి ఇల్లు తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ బాధ్యతను కూడా ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్కు అప్పగించినట్లు తెలుస్తుంది. ఓ ఖరీదైన ప్రాంతంలో రూ.50 కోట్లతో ఇల్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రభాస్ పూర్తిగా కేరాఫ్ ముంబై అయిపోతున్నాడు. తన అడ్రస్ మార్చేసుకుంటున్నాడు ఇప్పుడు.