షాజహాన్పూర్: సామూహిక అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించినందుకే ముగ్గురు యువకులు తనపై కిరోసిన్ పోసి తగులబెట్టారని.. సోమవారం యూపీలోని షాజహాన్పూర్లో నడిరోడ్డుపై కాలిన గాయాలతో వివస్త్రగా పడివున్న బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. రాయ్ ఖేడా గ్రామం సమీపంలోని పంట పొలాల్లో సోమవారం ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారయత్నం చేశారని, అయితే వారిని తాను ప్రతిఘటించడంతో ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొన్నది.
సోమవారం కాలేజీకి వెళ్లి బీఏ సెండియర్ విద్యార్థిని తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో ఆమె తండ్రి ఆమె కోసం అంతటా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత షాజహాన్పూర్లోనే ఓ రహదారిపై బాధితురాలు కాలినగాయాలతో వివస్త్రగా పడివుందని పోలీసుల ద్వారా ఆమె తండ్రికి సమాచారం అందింది. ముందుగా పోలీసులు ఆమెను జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించారు.
కాగా, బాధితురాలు మాటిమాటికి మాట మారుస్తున్నదని ఓ పోలీస్ అధికారి చెప్పాడు. కాలేజీలోని మూడో అంతస్తు నుంచి ఆస్పత్రిలోకి ఎలా వచ్చానో గుర్తులేదని బాధితురాలు ముందుగా చెప్పిందని.. ఇప్పుడేమో ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారయత్నం చేసి, ప్రతిఘటించడంతో నిప్పుపెట్టారని చెబుతున్నదని తెలిపాడు. కాగా, బాధితురాలు కాలేజీలోకి ప్రవేశించిన 10 నిమిషాలకే, వెనుకవైపు కూలిన గోడ నుంచి ఆమె బయటికి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపిస్తున్నది.