ఊరూరా వైకుంఠధామం.. సకల సౌకర్యాలతో నిర్మాణం
ఐదు జిల్లాల్లో వందశాతం పూర్తి.. మహబూబాబాద్లో 90 శాతం
నెలలోపు పూర్తయ్యేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు
పనులు ముమ్మరం చేసిన అధికారులు
వరంగల్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చివరి మజిలీకి చింత లేకుండా పల్లెప్రగతిలో భాగంగా ఊరూరా రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాలు నిర్మించింది. ఒక్క మహబూబాబాద్ జిల్లా మినహా మిగతా ఐదు జిల్లాల్లో వీటి నిర్మాణం వంద శాతం పూర్తయింది. ఆరు జిల్లాల్లో కలిపి 1,619 వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా, 1573 పూర్తయ్యాయి. నెల రోజుల్లోగా మిగిలినవి పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు.‘పల్లెప్రగతి’ గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఊరూరా వైకుంఠధామాలు ఉండాలని పల్లె ప్రగతిలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలని ఆదేశించడంతోపాటు అవసరమైన నిధులు విడుదల చేసింది. దీంతో అధికారులు వీటి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. మూడేళ్లలోనే ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా దాదాపుగా వంద శాతం వైకుంఠధామాల పనులు పూర్తికావొచ్చాయి.
అగ్రస్థానంలో జనగామ జిల్లా..
వైకుంఠధామాల నిర్మాణంలో జనగామ జిల్లా అగ్రస్థానంలో నిలువగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పూర్తయ్యాయి. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 90శాతం పూర్తికాగా మిగిలిన పనులు నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. మరో నెల రోజుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తికానుంది. ఆరు జిల్లాల్లో కలిపి 1,688 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,619 వైకుంఠధామాలకు గాను ఇప్పటివరకు 1,573 పూర్తయి చాలా గ్రామాల్లో అందుబాటులోకి వచ్చాయి. జనగామ జిల్లాలో 281 గ్రామ పంచాయతీలుండగా, అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది.