నెలనెలా ‘పట్టణ ప్రగతి’ నిధుల వరద
ఇప్పటి వరకు రూ.150 కోట్లు విడుదల
గ్రేటర్లో రూ.122 కోట్లతో 409 పనులు
రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాల నిర్మాణం
చెత్త సేకరణ కోసం 150 స్వచ్ఛ ఆటోల కొనుగోలు
వరంగల్, జనవరి 19 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులకే సరిపోతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నెల విడుదల చేస్తున్న పట్టణ ప్రగతి నిధులు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. నగరంలోని కాలనీల్లో సమస్యలు సత్వరం పరిష్కారం కావడంతోపాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట ప్రతి నెల నిధులను విడుదల చేస్తోంది. పట్టణ ప్రగతి నిధులతో గ్రేటర్లోని పలు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఓపెన్ జిమ్ పనులు సాగుతున్నాయి. వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శ్మశానవాటికల అభివృద్ధి, గ్రేటర్కు చెందిన స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.150.91 కోట్ల నిధులు
గ్రేటర్కు 23 నెలలుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. 2020 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన పట్టణ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు రూ. 150.91 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. క్రమం తప్పకుండా విడుదలవుతున్న పట్ణణ ప్రగతి నిధులతో గ్రేటర్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్మార్ట్సిటీ, ఇతర పథకాల ద్వారా నగర ప్రధాన రహదారుల అభివృద్ధి జరుగుతుండగా.. పట్టణ ప్రగతి నిధులతో గ్రేటర్లోని డివిజన్లలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, వైకుంఠధామాలు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నారు. దీంతో పాటు గ్రేటర్ కార్పొరేషన్లో ఇంటింటి చెత్త సేకరణలో కీలకపాత్ర పోషిస్తున్న స్వచ్చ ఆటోలను పట్టణ ప్రగతి నిదులతో కోనుగోలు చేశారు. గ్రేటర్లో సుమారు 150 స్వచ్చ ఆటోలు పట్టణ ప్రగతి నిధులతో కోనుగోలు చేశారు.
గ్రేటర్లో 409 పనులు
గ్రేటర్ పరిధిలో పట్టణ ప్రగతి 122 కోట్ల నిధులతో 409 అభివృద్ధి పనులు చేపట్టారు. 179.32 కోట్లతో ఈ పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికే రూ.108.39 కోట్లకు సంబంధించిన 275 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ.16.08 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 54.85 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. పట్టణ ప్రగతి నిధులతో 57వ డివిజన్లో మోడల్గా చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరంగల్ లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్కు టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్ దశలో ఉంది.
పనులకు కాంట్రాక్టర్ల మొగ్గు
పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు చేయడానికి బల్దియా కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా బిల్లుల పెండింగ్లతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే, పట్టణ ప్రగతి నిధులు ప్రతి నెల క్రమం తప్పకుండా వస్తుండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో గ్రేటర్ వరంగల్ నగరంలోని అన్ని డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది.