కరోనా నివారణకు వైద్యశాఖ సమాయత్తం
ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్
సింగరేణి వైద్యశాలలో రెండు వెంటిలేటర్లు
జయశంకర్ జిల్లాలో 128 కేసులు
భూపాలపల్లి, రేగొండలోనే అధికం
సరిహద్దుల్లో మెడికల్ చెక్పోస్టులు
భూపాలపల్లిటౌన్, జనవరి 19 : కరోనా కట్టడికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో అధికారులు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసొలేషన్కు పంపుతున్నారు. అత్యవసరమైతే ప్రభుత్వ దవాఖానల్లో అడ్మిట్ చేస్తున్నారు. బాధితుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆయా వైద్యశాలల్లో 160 బెడ్లను సిద్ధం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 128 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అధిక శాతం భూపాలపల్లి, రేగొండలో ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. సింగరేణి దవాఖానలో రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. ఒకవైపు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మరోవైపు వ్యాక్సినేషన్ను వేగవంతం చేశారు. జిల్లా సరిహద్దుల్లో మెడికల్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తూ జిల్లాలోకి అనుమతిస్తున్నారు.
వైద్యశాఖ ఏర్పాట్లు
కరోనా బాధితుల కోసం జిల్లా దవాఖానలో 60 బెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 20 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. అలాగే సింగరేణి ప్రాంతీయ వైద్యశాలలో 60 బెడ్లు, రెండు వెంటిలేటర్లు, చిట్యాల సీహెచ్సీలో 20 ఆక్సిజన్ బెడ్లు, మహదేవపూర్ సీహెచ్సీలో 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. సింగరేణి వైద్యశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కార్మిక కుటుంబ సభ్యులు ఆరుగురు అడ్మిట్ అయ్యారని వైద్యు లు తెలిపారు.
సరిహద్దుల్లో పరీక్షలు
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా అధికారులు జిల్లాలోని 12 పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇస్తున్నారు. పీహెచ్సీల జిల్లా సరిహద్దుల్లో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వంతెన నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన వారు ఎక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంటారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని భావించిన వైద్యశాఖ అధికారులు వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి హాస్పిటల్, చిట్యాల, మహదేవపూర్ సీహెచ్సీల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. జిల్లా దవా ఖానలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 60 బెడ్లను అవసరమైతే మళ్లీ కొవిడ్ పేషెంట్ల కోసం ఉపయోగిస్తాం. సింగరేణి వైద్యశాలలో రెండు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే 128 కేసులు నమోదయ్యాయి. ప్రమాదకరమేమీ కాదు. ఒమిక్రాన్ కేసులు జిల్లాలో నమోదు కాలేదు.