ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఘటన
గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధు
వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు
మృతుల్లో రేగొండ మండలవాసి?
జగ్గయ్యపేటలో విషాదఛాయలు
వెంకటాపురం (నూగూరు), జనవరి 18 : తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. అతడిని వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ విషయాన్ని ములుగు ఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్కౌంటర్ మృతుల్లో రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన కొమ్ముల నరేశ్ (అలియాస్) బుచ్చయ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈమేరకు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ వివరాలను ఒక ప్రకటనల ద్వారా వెల్లడించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, సర్పంచ్లు, కాంట్రాక్టర్లను అపహరించి హత్య చేయాలని సీపీఐ మావోయిస్టు గ్రూప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున వ్యూహం పన్నిందని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 16న ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కలిసి ములుగు-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్గఢ్లో కూంబింగ్ నిర్వహించినట్లు వివరించారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగగా, ఒక ముగ్గురు మావోయిస్టులు(ఒక మహిళ) మృతి చెందారని చెప్పారు. వీరి నుంచి ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఎన్సాస్ రైఫిల్, ఒక సింగిల్బోర్ వెపన్, 10 రాకెట్ లాంచర్లు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యరద్శి శాంత, ఇల్లెందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చయ్య ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో బుచ్చయ్య?
రేగొండ, జనవరి 18 : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో రేగొండ మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన కొమ్ముల ఐలయ్య-ఎలమ్మ కుమారుడు నరేశ్ (అలియాస్) బుచ్చయ్య మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో చేరి 15 ఏండ్లుగా పని చేస్తూ ఇల్లెందు ఏరియా కార్యదర్శిగా ఎదిగారు. ప్రస్తుతం జరిగిన ఎదురుకాల్పులో నరేశ్ మృతి చెందాడన్న వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ తమ్ముడిని ఒక్కసారైనా కలువలేకపోయామని నరేశ్ అక్క సరిత, అన్న సదయ్య బోరున విలపించారు.
గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలు
సుబేదారి : ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వైద్య చికిత్స కోసం ఘటనా స్థలం నుంచి హెలికాప్టర్లో హైదారాబాద్కు తరలించారు. మార్గమధ్యంలో హనుమకొండ సుబేదారి ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అత్యవసర వైద్య సేవలందించేందుకు దించారు. పక్కనే ఉన్న అంబులెన్స్లోకి తీసుకెళ్లి వైద్యులు గంట పాటుగా వైద్యపరీక్షలు చేశారు. మధు కుడి చేతి వేళ్లు, కుడి వైపు చాతిలో బులెట్ దిగడంతో, అతడి ఆరోగ్య పరిస్థితిని సీపీ తరుణ్జోషి ఫోన్ ద్వారా హైదారాబాద్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్కు అదే హెలికాప్టర్లో తరలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, ములుగు ఓఎస్డీ శోభన్కుమార్, ఇతర పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. మధుతో పాటు, ఎన్కౌంటర్లో పాల్గొన్న మరో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. వీరిలో ఒకరి కాలుకు స్వల్ప గాయం కాగా వైద్యులు చికిత్స చేశారు. మధు నల్గొండ జిల్లా వాసి.