అధికారుల అలసత్వం తగదు
గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీలు
మండల సభలో ఎంపీపీ అప్పారావు
వర్ధన్నపేట, జనవరి 18: అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ శాఖల వారీగా సమీక్షించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు విధి నిర్వహణలో, మండల సభకు వచ్చేందుకు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. దీనివల్ల పరిపాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి కూడా అధికారులు సమయానికి హాజరు కాకపోగా, వారి శాఖలకు సంబంధించిన సమీక్ష పూర్తి కాకముందే వెళ్లిపోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు కూడా మండల సభకు సకాలంలో హాజరైతేనే సమస్యలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని హితవు పలికారు. గ్రామాల్లో ఇప్పటికే గుర్తించి చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు, సర్పంచ్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్వాహకులు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల జరిపిన విచారణలో తేలిందని ఎంపీపీ అన్నారు. కేంద్రాలను సమగ్రంగా పరిశీలించి తప్పులు జరుగకుండా చూడాలని ఆయన సీడీపీవోను కోరారు. సమావేశంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కే రాజేశ్ఖన్నా, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి పాల్గొన్నారు.