మంత్రులకు పలువురు నాయకుల వినతి
కలెక్టర్ను కలిసిన సీపీఎం నాయకులు
పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
న్యాయం చేస్తామని భరోసా
భూపాలపల్లి టౌన్, జనవరి 18 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్యాదవ్, ఎంపీపీ మందల లావణ్యాసాగర్రెడ్డి మంగళవారం పలువురు మంత్రులకు వినతిపత్రం అందజేశారు. రేగొండ మండలం చెన్నాపురం గ్రామంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి ఆధ్వర్యంలో వారికి వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన మంత్రులు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్రెడ్డి రాజిరెడ్డి, నాగారం ఎంపీటీసీ వినోదా సాయికుమార్ పాల్గొన్నారు.
మిర్చి రైతులను ఆదుకోవాలి
వెంకటాపూర్: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు కోల్పోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుబంధు సమితి ఉమ్మడి భూపాలపల్లి జిల్లా సభ్యుడు కూరెళ్ల రామాచారి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైరస్తో కొంత పంట నష్టపోగా, వడగండ్ల వానకు పూర్తిగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానన్నారు.
పంట నష్టం పరిశీలన
చిట్యాల: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన మిర్చి, కూరగాయల పంటలను ఏవో ఎన్ రఘుపతి పరిశీలించారు. మండలంలోని వరికోల్పల్లి, గిద్దెముత్తారం, కుమ్మరిపల్లి, అందుకుతండా గ్రామాల్లో పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. మండల వ్యాప్తంగా సుమారు 1580 ఎకరాల మిర్చి, 250 ఎకరాల కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవో సందీప్, సర్పంచ్లు పెండెం సాంబమూర్తి, పీ పోశాలు, భాస్క ర్, బాధిత రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్కు వినతి
ములుగుటౌన్ : వైరస్, అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మ వెంకట్రెడ్డి మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కానీ, వైరస్, అకాల వర్షంతో పంటను పూర్తిగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో సర్వే చేయించి రైతులకు ఎకరాకు రూ. లక్ష పరిహారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, ఎండీ అమ్జద్పాషా, రత్నం రాజేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గఫూర్పాషా, సాగర్, ఐలయ్య పాల్గొన్నారు.