మాస్క్ లేకుంటే పైన్ వేయండి
కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టండి
కలెక్టర్ భవేశ్ మిశ్రావైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు ఆదేశం
భూపాలపల్లి రూరల్, జనవరి 18 : మాస్క్ లేకుండా తిరిగే వారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని, కరోనా మూడోదశ నుంచి ప్రజలను కాపాడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కరోనా మొదటి, రెండో దశ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అధికార యంత్రాంగం చూపిన ఉత్సాహాన్ని మూడో దశలోనూ చూపాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వంద శాతం, రెండో డోస్ 76 శాతం పూర్తయింది. కానీ, మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానా విధించాలని ఫోన్లో పోలీస్ అధికారులను ఆదేశించారు. అన్ని పీహెచ్సీలలో ఆక్సిజన్ కాన్సన్ ట్రెటర్లు, బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల లోపు టీనేజర్లను గుర్తించి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. పాము కాటుతో పాటు అన్ని రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్వో కొమురయ్య, డాక్టర్లు శ్రీదేవి, తిరుపతి, ఉమాదేవి, రవికుమార్, గోపీనాథ్, జైపాల్, చంద్రశేఖర్, భాష్యనాయక్, వైద్యాధికారులు పాల్గొన్నారు.