జిల్లాలో అనుమతులు లేకుండానే నిర్వహణ
నాసిరకం మిషన్లు
ఒక్కో ల్యాబ్లో ఒక్కో విధంగా రిపోర్టులు
అర్హత లేనివారే ఎక్కువ
ఆర్టీపీసీఆర్ పరీక్షలూ చేస్తున్న వైనం
ప్రజల ప్రాణాలతో చెలగాటం
జిల్లా కేంద్రంలోని ఓ ల్యాబ్లో వైద్యశాఖ అధికారుల తనిఖీలు
భూపాలపల్లి టౌన్, జనవరి 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ల్యాబ్లు (డయాగ్నోస్టిక్ సెంటర్లు ) పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేస్తూ అర్హతలేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యశాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడవుతున్నది. ప్రాంచైసీల మాదిరిగా ఒక బ్రాండ్తో ఎలాంటి అనుమతులు లేకుండాలనే డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తూ ప్రజల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ తతంగం భూపాలపల్లి పట్టణంలోని థైరోకేర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో వెలుగుచూసింది. డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించి ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండానే డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారని నిర్ధారించి డీఎంహెచ్వోకు నివేదిక అందజేశారు. ఇంకా జిల్లాలో అనుమతి లేని ల్యాబ్లు ఎన్ని ఉన్నాయనే విషయమై వైద్యశాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమవుతున్నారు. అలాగే గ్రామాల్లో సైతం ల్యాబ్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తుండడంతో రిపోర్టులు సక్రమంగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనుమతులు లేకుండానే..
జిల్లాలోని కొందరు ఆర్ఎంపీలు డీఎంఎల్టీ చేయకున్నా ల్యాబ్ల్లో పని నేర్చుకుని రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీఎంఎల్టీ, పాథాలాజికల్ సర్టిఫికెట్తో వారు చేసే పరీక్షలు, సమకూర్చుకున్న మిషన్ల వివరాలు పేర్కొంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన ధ్రువీకరించి అనుమతిచ్చిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కాగా, జిల్లాలో ముఖ్యంగా భూపాలపల్లిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదనే విషయం అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఒక్కో ల్యాబ్లో ఒక్కో విధంగా రిపోర్టులు వస్తున్నాయని, గతంలో ప్రజలు ఆందోళన చేసిన ఘటనలున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ దవాఖానలో మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సి ఉండగా ప్రైవేట్ ల్యాబ్ల్లో సైతం పరీక్షలు చేస్తున్నారు.