భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 17: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ సిద్ధమవుతున్నది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 26 ఉండగా 1915 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరికి మొత్తం పది కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండో తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 12వ తేదీన అదనపు కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటర్ మీటింగ్ నిర్వహించారు. 20వ తేదీన పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా నోడల్ అధికారి కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేందుకు వీలుగా మరిన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు మాస్క్ ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం భూపాలపల్లి నుంచి మీనాజీపేట, బోర్లగూడెం, పలిమెల, గుర్రంపేట, కాటారం, తాడిచెర్ల రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 26 ఉన్నాయి. ఇందులో మొత్తం 1915 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు మహదేవపూర్, కాటారం, భూపాలపల్లి, చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గంగారం, చిట్యాల మోడల్ స్కూళ్లు, కాటారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(బాయ్స్), కాటారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల (గల్స్), భూపాలపల్లి ప్రైవేట్ గాంధీ జూనియర్ కళాశాల, భూపాలపల్లి ప్రైవేట్ పవిత్ర జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఎక్కువ ప్రశ్నల వెసులుబాటుతో ప్రశ్న పత్రాలు
కరోనా కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆన్లైన్లో ఎక్కువ శాతం విద్యాబోధన జరిగినందున విద్యార్థులు సులభంగా పాస్ అయ్యేందుకు విద్యాశాఖ అధికారులు 70 శాతం సిలబస్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రశ్న పత్రాలను ఎక్కువ వెసులుబాటుతో రూపొందించారు. షార్ట్ నోట్స్, మాదిరి ప్రశ్న పత్రాలు, బేసిక్ లెర్నింగ్ మెటిరియల్ను tsbie.ccg.gov.in వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. సగటు విద్యార్థి ఈ లెర్నింగ్ మెటీరియల్ ను చదివితే తప్పకుండా పాస్ అవుతారని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాట్లు
కొవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనల మేరకు పరిక్షలు నిర్వహిస్తాం. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించేలా విద్యార్థుల మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పరీక్ష కేంద్రాలను అదనంగా కేటాయిస్తాం. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఈనెల 25 నుంచి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులు విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా చదువుకోవాలి.
-దేవరాజం, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి