రూ.388.20కోట్లతో కాలువ తవ్వకం
జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం
నిధుల మంజూరికి మంత్రివర్గం ఆమోదం
ముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనం
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
నష్కల్ జలాశయం వద్ద పంప్హౌస్కు రూ.104.92 కోట్లు మంజూరు
జనగామ, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా భూములకు జలాభిషేకం జరుగనుంది. తపాస్పల్లి రిజర్వాయర్కు మల్లన్నసాగర్ నుంచి నేరుగా నీటిని తరలించే కాలువకు రూ.388.20కోట్లు మంజూరు చేస్తూ సోమవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే తపాస్పల్లి రిజర్వాయర్ ఏడాది పాటు జలకళ సంతరించుకోనుంది. జనగామ నియోజకవర్గంలో సాగునీటి కరువు శాశ్వతంగా దూరం కానుంది. గతంలో డాట్ ఏరియాగా ఉన్న జనగామలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైస్, జిన్నింగ్ మిల్లులు వెలుస్తున్నాయి. బచ్చన్నపేట, నర్మెట, లింగాలఘనపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, జనగామ మండలాల్లోని ప్రజలు బతుకుదెరువు కోసం పలు ప్రాంతాలకు వలస వెళ్లగా, ఇప్పుడు కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల పుణ్యమా అని తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. దేవాదుల పథకంలో భాగంగా జనగామ జిల్లాలోని గండిరామారం చెరువు, కన్నారం చెరువు వరకు పంప్హౌస్, కాలువ పనులు, గుండ్లసాగర్ నుంచి లోక్యతండా వరకు పైపులైన్ పనులు, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నష్కల్ రిజర్వాయర్ వద్ద పంప్హౌస్ నిర్మాణానికి మొత్తం రూ.104.92కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేవాదుల రూపంలో సరికొత్తదారి దీపం పట్టి జనగామ జిల్లాకు ఆహ్వానిస్తున్నది. రైతు మోమున చిరునవ్వు చిద్విలాసమై కాంతులీనుతున్నది. కూలీ గుండెలో పని సింగిడి సరికొత్త జీవితానికి భరోసా ఇస్తున్నది. సాగుకే కాదు తాగునీటికి తండ్లాడిన తావుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు రీ డిజైన్తో గోదారమ్మ సరికొత్త సిరుల పూలు పూయిస్తున్నది. ఒకనాటి కరువుగడ్డ జనగామ జిల్లాకు నెత్తిన కుండలా ఏడాది కాలంపాటు భూములకు జలాభిషేకం చేసే తపాస్పల్లి రిజర్వాయర్కు మల్లన్నసాగర్ నుంచి నేరుగా నీటిని తరలించే కాలువకు రూ.388.20కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం సోమవారం నిర్ణయం తీసుకుంది. తపాస్పల్లి రిజర్వాయర్ 365 రోజులు జలకళ సంతరించుకునేలా కాలువ నిర్మాణం జరిగితే జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీటి కరువు శాశ్వతంగా దూరమై పల్లెపల్లె పచ్చటి పొలాలతో సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ ఏర్పడక ముందు ఎటుచూసినా నెర్రెలు బారిన భూములు.. డొక్కలెండిన జీవులు.. గంటల తరబడి బోరు నడిచినా గోలెం నిండని దైన్యం.. ఉపాధి కరువై జనాలు ఊర్లు విడిచిన పల్లెలు.. ఇదీ ఒకప్పటి జనగామ ప్రాంత దుస్థితి.. కానీ ఇప్పుడు సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల ఫలితంగా ఎటుచూసినా ఆకుపచ్చ ఆవరణమే.. దశాబ్దాల క్రితం ఉపాధి కోసం ఊరు విడిచిన రైతులు, కూలీలు, జనాలు తిరిగి తమ సొంతూళ్లకు సంబురం గా పయనం అయ్యేలా మారిన జీవనచిత్రం సరికొత్తగా ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు కరువుకు చిరునామాగా ఉన్న జనగామ ప్రాంతం దేవాదుల రూపంలో గోదారమ్మ కడుతున్న ఆకుపచ్చని చీరెకు ఆనవాలు అయ్యింది.
దక్కన్ పీఠభూమిలోనే అత్యం త ఎత్తైన ప్రాంతంగా ఉన్న చరిత్ర బచ్చన్నపేటది. సముద్ర మట్టానికి 550మీటర్ల ఎత్తయిన ప్రాంతంగా, డాట్ ఏరియాగా ముద్రపడి బోర్లువేయడం, ఇసుక తీయటానికి వీళ్లేదని నిషేధాజ్ఞలకు గురైన అతి దుర్భిక్ష ప్రాంతం. వడగండ్ల కడకండ్లు ఏటా ముప్పేట దాడిచేసే ప్రాంతం.. తిండి గింజలకూ కష్టమైన చోట రైస్, జిన్నింగ్ మిల్లులు వెలుస్తున్నాయి. వానొస్తేనే గొంతుతడిసే చెరువులు ఎండాకాలంలోనూ నీటితో మత్తడి దుంకుతున్నాయి. ఉపాధి హామీ పనులే పెద్ద దిక్కుగా ఉన్న కూలీలకు చేతినిండా ఎవుసం పనిదొరుకుతుంటే.. నాటి వడగండ్ల వానలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టి.. మనుషుల్లోనూ ఊరిలోనూ మార్పులేకాదు.. వాతావరణానికే కొత్త అడుగులు పడేలా చేసిన ఘనత తెలంగాణది. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట, లింగాలగణపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, జనగామ మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఉన్న ఊళ్లల్లో ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలతోపాటు ఆంధ్రా ప్రాంతాలకు వలసెల్లిపోయారు. దశాబ్దాల తరబడి ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగాల్లోనో, వ్యవసాయ కూలీలుగానో స్థిరపడిపోయారు. పెండ్లిండ్లకో పేరంటాలకో చుట్టపుచూపుగా వచ్చిపోయేప్పుడు గుడ్లల్లో నీళ్లు గుడ్లల్లనే ఆపుకొని వెళ్లిపోయే దృశ్యాలు అనేకం ఉండేది. అటువంటిది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులు తుది దశకు చేరుకోవడం, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు.. అక్షరాల నిజం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పల్లెల్లో బతుకు ఆశలు భరోసా ఇస్తున్నాయని తెలిసి ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా తిరిగి మళ్లీ తమ తమ స్వస్థలాలకు వచ్చారు.
నష్కల్ జలాశయం వద్ద పంప్హౌస్కు రూ.104.92కోట్లు
దేవాదుల పథకంలో భాగంగా జిల్లాలోని ఎత్తయిన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గండిరామారం చెరువు కన్నారం చెరువు వరకు పంప్హౌజ్, కాలువ పనులు, గుండ్లసాగర్ నుంచి లోక్యతండా వరకు పైపులైన్ పనులు, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నష్కల్ రిజర్వాయర్ వద్ద పంప్హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ.104.92కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు పాదాభివందనం
తాగునీటికి తల్లడిల్లిన జనగామ నియోజకవర్గానికి నిండుగా తాగునీరిచ్చి, సరిపడా సాగునీరు అందించి భూమికే బరువయ్యేంత పంట పండించి గోదాంలు, రైస్మిల్లులు.. రైతువేదికలు ధాన్యం నిండేలా.. రాబో యే తరాలకు నీటి కష్టం లేకుండా చూసిన కేసీఆర్కు రైతుల పక్షాన పాదాభివందనం. మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లికి నీటి కొరత ఉండకుండా నెలల తరబడి మేధోమథనం చేసి రూ.388.20కోట్లు కాలువ తవ్వేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. కలియుగానికి వింతైన కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్తగా.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా రీ డిజైన్ చేస్తున్న పాలనాధక్షుడు కేసీఆర్కు యావత్తు రైతుల పక్షాన, నాయకులు, ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు.