ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలి
కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి రూరల్, జనవరి 17: ప్రతి ఉద్యోగి సాంకేతికంగా అభివృద్ధి సాధించి ఫైళ్లు పెండింగ్లో ఉంచకుండా నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రొజెక్టర్ ద్వారా వారు చేయాల్సిన విధులను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధిలో భాగమైనప్పుడే ప్రభుత్వ ఉద్యోగి నిజమైన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించినట్లవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కొత్తగా చేరిన ఉద్యోగులు గతంలో నుంచి రన్నింగ్ అవుతున్న ఫైళ్లను స్వీకరించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ, ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ చిన్న సమస్యకైనా సంపూర్ణంగా పరిష్కారం చూపాలని సూచించారు. లోకాయుక్త, హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం, తదితర సంస్థల ఆదేశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. నిధులు, మానవ వనరులు అందుబాటులో ఉన్నందున ప్రభుత్వానికి ఎలాంటి విమర్శలు రాకుండా పని చేయాలని అన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయంపై తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలుగకుండా త్వరగా ఆర్థిక సాయం అందేలా తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. ఈ సమావేశాల్లో జేసీ కూరాకుల స్వర్ణలత, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్డీవో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.