జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్16 (నమస్తేతెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో సుమారు పది కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా పెట్టనున్నారు. కోడి పందేలు, గంజాయి, పేకాట, అల్లర్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. రౌడీషీట్ వంటి కేసులను నమోదు చేసేందుకు వెనుకాడబోమని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు బ్లూకోల్ట్స్ బృందాలు నిరంతరం పట్టణంలో తిరుగుతూ పేకాట, బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నాయి. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదిలేదని పోలీసులు తేల్చిచెప్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంపై పోలీసులు డేగ కన్నుతో పహారా కాయనున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు శివారులో ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, గంజాయి, పొగతాగడంతో పాటు పేకాట, కోడి పందేలు, తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు. డ్రోన్ కెమెరాతో పాటు మూడు ప్రత్యేక బ్లూకోల్ట్స్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. అల్లర్లు సృష్టించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు వెనుకాడబోమని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.
డ్రోన్ కెమెరాతో నిరంతం నిఘా
జిల్లా కేంద్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు డ్రోన్ కెమెరాతో నిరంతం పర్యవేక్షించానున్నారు. పట్టణం, అటవీ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో పాటు, గుట్కా, గంజాయి, పొగతాగితే చిత్రీకరించి కఠిన చర్యలను చేపట్టనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లూకోట్ బృందాల సాయంతో పట్టుకుని కేసులు నమోదు చేయనున్నారు. అలాగే పేకాట, కోడి పందేలపై ఉక్కుపాదం మోపనున్నారు. పట్టణ ప్రజలు సుఖవంతమైన. ప్రశాంతమైన జీవనం గడపడానికి పోలీసులు శాంతిభద్రతలకు భంగం వాటిళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.