వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధికారులతో సమావేశం
భూపాలపల్లి రూరల్, జూలై 14: జయశంకర్ భూపాలపల్లి, ములుగును టీబీ రహిత జిల్లాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య రెండు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టీబీ నిర్మూలనపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ కేసులు తక్కువగా నమోదవుతున్నందున ఈ రెండు జిల్లాలను టీబీ నిర్మూలన మోడల్ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేలా అధికారులు కృషి చేయాలన్నారు. టీబీ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో 2,700 మంది టీబీ అనుమానిత వ్యక్తులు ఉన్నారని, మూడు రోజుల్లోగా ఇంటింటి సర్వే నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ జేడీ డాక్టర్ రాజేశం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ స్నేహ శుక్ల, డీఎంహెచ్వోలు డాక్టర్ శ్రీరాం, డాక్టర్ అప్పయ్య, టీబీ నిర్మూళన అధికారులు పాల్గొన్నారు.
భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయండి
అభివృద్ధి పనుల కోసం చేపడుతున్న భూ సేకరణ పనులు పెండింగ్లో ఉంచకుండా నిర్వాసితులకు నష్ట పరిహారం అందించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పని చేసే భూ సేకరణ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్ట్లు, సింగరేణి, జెన్కో సంస్థలకు అవసరమైన భూ సేకరణ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి, జెన్కో సంస్థలకు అవసరమైన భూమిని ఇదివరకే గుర్తించామని, వెంటనే భూ సేకరణ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వివిధ పనులకు అవసరమైన పెండింగ్ లో ఉన్న భూమి సేకరణ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, రవికిరణ్, సెక్షన్ అధికారులు శ్రీకాంత్, మనోజ్, ఆర్డీవో కార్యాలయం అధికారులు చక్రధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగుటౌన్ : జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల మేరకు జిల్లాలో నేడు, రేపు కొన్ని ప్రదేశా లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దన్నారు. గాలి తీవ్రత అ ధికంగా ఉండే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు క్షేత్ర స్థా యిలో పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.